TTD First Aid Center: కలియుగ వైకుంఠమైన తిరుమలకు కాలినడకన వచ్చే భక్తుల ఆరోగ్య భద్రతపై తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రత్యేక దృష్టి సారించింది. అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్లే భక్తుల కోసం అత్యవసర వైద్య సేవలను మరింత చేరువ చేసింది. ఇందులో భాగంగా అలిపిరి మెట్ల మార్గంలోని 7వ మైలు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ‘ఫస్ట్ ఎయిడ్ సెంటర్’ (First Aid Center) ను టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో, అదనపు ఈవో కూడా పాల్గొన్నారు.
భక్తుల ప్రాణ రక్షణే ధ్యేయంగా అపోలో కార్డియాక్ సెంటర్ (Apollo Cardiac Center) సహకారంతో టీటీడీ ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. సాధారణంగా మెట్ల మార్గంలో ప్రయాణించే భక్తులు 7వ మైలు వద్దకు వచ్చేసరికి అలసిపోతుంటారు. వయసు పైబడిన వారు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు గుండె సంబంధిత ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, గుండె సంబంధిత సమస్యలకు ‘గోల్డెన్ అవర్’లో త్వరితగతిన వైద్యం అందించడమే ఈ సెంటర్ ముఖ్య ఉద్దేశం. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల శ్రీవారి భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం చైర్మన్ బి.ఆర్. నాయుడు మాట్లాడుతూ.. “నడకదారిలో వచ్చే సామాన్య భక్తుల ఆరోగ్యమే మాకు ముఖ్యం. నడిచేటప్పుడు ఆయాసం వచ్చినా, ఛాతీ నొప్పి వచ్చినా లేదా ఇతర అత్యవసర ఆరోగ్య సమస్యలు తలెత్తినా భక్తులు వెంటనే ఈ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలి,” అని విజ్ఞప్తి చేశారు. టీటీడీ తీసుకున్న ఈ చర్య ఎంతోమంది ప్రాణాలను కాపాడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ ప్రాథమిక చికిత్సా కేంద్రంలో అత్యాధునిక సౌకర్యాలను కల్పించారు. టీటీడీ మరియు అపోలో ఆసుపత్రికి చెందిన నిపుణులైన వైద్యులు, శిక్షణ పొందిన పారామెడిక్స్ బృందం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుంది.
గుండె పనితీరును పరీక్షించేందుకు ఈసీజీ (ECG) యంత్రం.
శ్వాస ఇబ్బందులకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్, నెబ్యులైజర్.
అత్యవసర సమయంలో ప్రాణాలను కాపాడే ఔషధాలు (Emergency Medicines) సిద్ధంగా ఉంటాయి.
Read Also: TDP vs YCP : రప్పా రప్పా మళ్లీ మొదలెట్టిన వైసీపీ.. తగ్గేదెలే అన్న టీడీపీ!