Amaravati Development: గత ఐదేళ్ల కాలంలో మూడు రాజధానుల ముసుగులో అమరావతిపై వైఎస్ జగన్, ఆయన అనుచరులు తీవ్రమైన విషాన్ని చిమ్మారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మండిపడ్డారు. ప్రస్తుతం అమరావతిలో శరవేగంగా జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకనే వైసిపి నేతలు మళ్లీ కుట్రలకు తెరలేపుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. రాజధాని ప్రాంతంలో అలజడులు సృష్టించేందుకు వైసిపి రౌడీ మూకలు పన్నిన వ్యూహాలను అమరావతి రైతులు ఐక్యంగా తిప్పికొట్టారని మంత్రి స్పష్టం చేశారు.
రైతులపై అణచివేత.. నేడు ఏ మొహం పెట్టుకుని వస్తారు?
వైసిపి అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని సర్వనాశనం చేయడమే కాకుండా, భూములిచ్చిన రైతులపై అక్రమ కేసులు బనాయించి, శారీరకంగా, మానసికంగా వేధించారని మంత్రి గుర్తు చేశారు. నాడు మహిళలు, వృద్ధులని కూడా చూడకుండా హింసించిన వైసిపి నేతలు, నేడు ఏ మొహం పెట్టుకుని రాజధాని ప్రాంతంలో అడుగుపెడుతున్నారని ఆయన ప్రశ్నించారు. జగన్ హయాంలో జరిగిన అరాచకాలను రాజధాని ప్రజలు ఎప్పటికీ మరువరని అన్నారు.
శరవేగంగా అమరావతి నిర్మాణం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతికి పూర్తి చట్టబద్ధత కల్పించిందని మంత్రి వీరాంజనేయస్వామి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాజధాని పనులు ఇప్పుడు శరవేగంగా ముందుకు సాగుతున్నాయని, దీనిని చూసి తట్టుకోలేకనే వైసిపి నేతలు లేనిపోని గొడవలు సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు.
జగన్ వైఖరిలో మార్పు లేదు
ఇటీవలి ఎన్నికల్లో ప్రజలు ఘోర పరాజయాన్ని మిగిల్చినా జగన్ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని మంత్రి విమర్శించారు. ‘జగన్ ఇంకా మావిగన్’ అంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, కానీ ప్రజలు ఆయన కుట్రలను నిశితంగా గమనిస్తున్నారని హెచ్చరించారు. అమరావతి అనేది దేవతల రాజధాని అని, జగన్ అండ్ కో ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాజధాని నిర్మాణాన్ని ఆపడం ఎవరి తరం కాదని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి స్పష్టం చేశారు.