Indiramma Houses: స్వేచ్చ బ్యూరో: క్యూర్ పరిధిలో అత్యంత క్వాలిటీతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం హౌజింగ్ శాఖకు సూచించింది. రాష్ట్రంలోని నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో ఎలాంటి లోపాలు రాకూడదని సర్కార్ నొక్కి చెప్పింది. ముఖ్యంగా క్యూర్ పరిధిలోని ఇళ్లు పకడ్బందీగా నిర్మించాలని ఆదేశాలిచ్చింది. సర్కార్ ఆదేశాల మేరకు ..ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు హౌసింగ్ శాఖ సర్వం సిద్ధం చేసింది. కేవలం ఇళ్లు కట్టడమే కాకుండా, ఎక్కడా రాజీ పడకుండా క్యూరింగ్ విధానంలో అత్యంత నాణ్యమైన నిర్మాణాలను పేదలకు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం సరికొత్త ప్రణాళికను రూపొందించింది.ఇప్పటి వరకు గ్రామాల్లో ఇళ్లను నిర్మించిన హౌసింగ్ శాఖ..ఇక నుంచి అర్భన్ ప్రాంతాల్లోనూ ఇందిరమ్మ ఇళ్లను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
క్యూర్ పరిధి నిర్మాణాల్లో మొదటి దశలో భాగంగా ఎంపిక చేసిన 26 నియోజకవర్గాల్లో పైలట్ మోడ్లో ఈ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు. ఇక్కడ సాధించే ఫలితాలు, ఎదురయ్యే సవాళ్లను బేరీజు వేసుకుని, ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్ను వేగవంతం చేయనున్నారు.క్యూర్ పరిధిలో మొదటి విడతలో భాగంగా ఎంపిక చేసిన ప్రతి నియోజకవర్గానికి 500 ఇళ్లను మంజూరు చేయనున్నారు.ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో 30కి పైగా ప్రభుత్వ స్థలాలను హౌసింగ్ శాఖ అధికారులు గుర్తించారు. ఎటువంటి వివాదాలు లేని, రవాణా సౌకర్యం ఉన్న స్థలాలకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. అంతేగాక ఆయా పేదల ఉపాధికి ఎలాంటి ఇబ్బందులు లేని ప్రాంతాలను ఎంపిక చేసినట్లు ఆఫీసర్లు వివరించారు.
Also read: మంచిర్యాలలో దారణం.. తమ్ముడిని గొడ్డలితో నరికి చంపిన అన్న!
ఈ ఆర్థిక సంవత్సరంలో ఎలాగైనా 1 లక్ష ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలనే గట్టి పట్టుదలతో ప్రభుత్వం ఉంది. ఇందుకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల ప్రక్రియ జూలై మొదటి వారంలోనే ప్రారంభం కానుంది. అర్హులైన పేదలు గ్రామ సభలు, ప్రజా పాలన కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు ప్రకటించారు. ఇందిరమ్మ ఇళ్ల డిజైన్ ఎలా ఉండబోతోంది? లబ్ధిదారుల అర్హతలు ఏంటి? నిధుల విడుదల ఎలా జరుగుతుంది? అనే పూర్తి వివరాలతో కూడిన ఒక ప్రత్యేక సమాచార బ్రోచర్ను కూడా హౌసింగ్ శాఖ ప్రస్తుతం సిద్ధం చేస్తోంది. రాబోయే రెండు మూడు రోజుల్లోనే ఈ బ్రోచర్ను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేయనున్నట్లు సమాచారం.
“క్యూర్ పరిధిలో అత్యంత ముఖ్యమైన ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించబోతున్నాం. కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూముల్లో ఇండ్ల నిర్మాణాలు చేపట్టబోతున్నాం. అంతేగాక ఆ స్థలాల్లో అన్ డివైడెడ్ షేర్ కింద కూడా మహిళలకు వాట కల్పించబోతున్నాం. ఈమేరకు మహిళల పేరిట రిజిస్ట్రేషన్ చేయిస్తాం. ప్రజాప్రభుత్వంలో పేదలకు న్యాయం చేయడమే ప్రభుత్వం లక్ష్యం. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం పేదల సంతోషం కోసం నిత్యం పరితపిస్తుంది. గత ప్రభుత్వాలు ప్రజలను మోసం చేసి ఇబ్బందులకు గురి చేశారు. కానీ తమ సర్కార్ పారదర్శకంగా ప్రజల పక్షాన నిలిచి అండగా ఉంటుంది.
Also read: Plane Crash: సౌతాఫ్రికాలో ఘోర ప్రమాదం.. హన్మకొండ జిల్లాకు చెందిన పైలట్ దుర్మరణం!