Kesineni Chinni: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ విమర్శలు డోస్ పెంచాయి. ముఖ్యంగా అభివృద్ధి పనులపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు అధికార పక్ష నేతలు తమదైన శైలిలో కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), మాజీ ఎంపీ కేశినేని నానిని ఉద్దేశించి చేసిన ఘాటు వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈర్ష్య, ద్వేషంతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.
ఫిర్యాదులు చేసినా ఫలితం లేదు
రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రతిపక్షాలు కావాలనే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఎంపీ చిన్ని మండిపడ్డారు. ఇప్పటికే రాష్ట్రపతికి, దేశంలోని ఇరవైకి పైగా ముఖ్యమంత్రులకు లేఖలు రాసి, ఫిర్యాదులు చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. ఇలాంటి దిగజారుడు రాజకీయాలను ఏపీ ప్రజలు ఎప్పుడో గమనించారని, అందుకే వరుసగా వారిని తిరస్కరిస్తున్నారని గుర్తుచేశారు.
Also Read: శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ-ఆటో ఢీకొని ముగ్గురు మహిళలు మృతి!
ట్రంప్, పుతిన్కు చెప్పినా అంతే!
ట్విట్టర్ వేదికగా చేస్తున్న విమర్శల్లో కనీసం ఒక్క శాతం కూడా నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ‘మీరు కేవలం రాష్ట్రపతికో, సీఎంలకో ఫిర్యాదు చేస్తే సరిపోదు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, నార్త్ కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్, ఆఖరికి మన కేఏ పాల్కు ఫిర్యాదు చేసుకున్నా ఉపయోగం ఉండదు’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న పనుల్లో ఎలాంటి అవినీతి లేదని, ఎవరూ వీటిని అడ్డుకోలేరని తేల్చి చెప్పారు.
పక్కకెళ్లి ఆడుకో పో..!
ట్వీట్లలో విషం చిమ్మడం ఆపి, వాస్తవాలను తెలుసుకోవాలని హితవు పలికారు. సోషల్ మీడియాలో మైలేజ్ కోసం అబద్ధాలు ప్రచారం చేయడం మానుకోవాలని సూచిస్తూ.. ‘ఇకనైనా ఈ వృధా ప్రయాసలు ఆపి.. పక్కకెళ్లి ఆడుకో పో’ అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వం వైపు నుంచి పనులు పారదర్శకంగా జరుగుతున్నాయని, ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు సాగవని ఆయన స్పష్టం చేశారు.