Kesineni Nani: తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మరో ల్యాండ్ స్కామ్ కలకలం రేపుతోంది. ప్రతిష్టాత్మక ఐటీ పార్క్ కోసం కేటాయించిన వందల ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ మాజీ ఎంపీ కేశినేని నాని ఒక సంచలన లేఖ రాశారు. ప్రస్తుత విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తన పదవిని అడ్డం పెట్టుకుని, బినామీ సంస్థల ద్వారా హైదరాబాద్లో వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ నాని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలను లేఖతో పాటు ముఖ్యమంత్రికి సమర్పించారు.
రూ. వందల కోట్ల విలువైన ఐటీ పార్క్ భూమిపై కన్ను
కూకట్పల్లిలోని ప్రగతి నగర్ సమీపంలోని శాంషీగూడ (సర్వే నంబర్ 57) పరిధిలో టీజీఐఐసీ (TGIIC) ఐటీ పార్క్ కోసం కేటాయించిన 112.72 ఎకరాల అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని ఒక సిండికేట్ అక్రమంగా చేజిక్కించుకోవడానికి ప్రయత్నిస్తోందని కేశినేని నాని లేఖలో పేర్కొన్నారు. ఎంపీ కేశినేని చిన్ని కుటుంబ సభ్యులకు చెందిన బినామీ సంస్థ ‘ఎక్సెల్లా ప్రాపర్టీస్’ ఈ భారీ ల్యాండ్ గ్రాబింగ్కు తెరలేపిందని ఆయన ఆరోపించారు.
Also Read: వైసీపీ హయాంలో వేధింపులు.. నేడు ఏ మొహం పెట్టుకుని రాజధానికి వెళ్తారు? మంత్రి డోలా
కోర్టులను తప్పుదోవ పట్టించే కుట్ర
ఈ భూమిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) విధించిన యాక్టివ్ ఫ్రీజ్లను, ఎన్సీఎల్టీ (NCLT) ఇన్సాల్వెన్సీ బార్లను సుప్రీం కోర్టు ముందు ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని నాని విమర్శించారు. మోసపూరితమైన ప్రైవేట్ రాజీ పిటిషన్ల ద్వారా కోర్టులను తప్పుదోవ పట్టించి, ఈ ప్రభుత్వ భూమిని తమ సొంతం చేసుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ ప్రకారం.. శాంషీగూడలోని ఈ స్థలం పూర్తిగా ‘పోరంబోకు సర్కారీ’ (ప్రభుత్వ) భూమి అని, దీనిపై ఏ ప్రైవేట్ వ్యక్తికీ ఎలాంటి హక్కులు లేవని స్పష్టంగా రుజువైందని గుర్తుచేశారు.
రేవంత్ రెడ్డి సర్కార్కు డిమాండ్లు
ఇంతటి పక్కా రికార్డులు ఉన్నప్పటికీ, సదరు బినామీ సిండికేట్ నాగమ్మ టెంపుల్ సమీపంలో భారీ ఎర్త్మూవర్లతో అక్రమంగా బారికేడ్లు వేసి భూమిని కబ్జా చేయడానికి తెగబడిందని నాని ఆరోపించారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అడ్వకేట్ జనరల్ ద్వారా సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇంటర్వెన్షన్ అప్లికేషన్ దాఖలు చేసి, ప్రైవేట్ శక్తుల రాజీ పిటిషన్లను అడ్డుకోవాలన్నారు. హైడ్రా కమిషనర్కు తక్షణ ఆదేశాలు జారీ చేసి, శాంషీగూడ సైట్ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని.. అక్కడ వేసిన అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించడానికి ప్రయత్నించినందుకు గానూ ‘ఎక్సెల్లా ప్రాపర్టీస్’ భాగస్వాములపై సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ ట్రెస్పాస్, చీటింగ్ కేసులు నమోదు చేయాలని తెలిపారు. ప్రజాధనాన్ని, ప్రభుత్వ ఆస్తులను కాపాడటంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని నమ్ముతున్నట్లు కేశినేని నాని తన లేఖలో ఆశాభావం వ్యక్తం చేశారు.