Botsa Satyanarayana: విశాఖపట్నంలో ప్రెస్ మీట్ నిర్వహించిన శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతి రైతుల బాధలు తెలుసుకునేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నాయకులపై హత్యాప్రయత్నం జరిగిందని, ఈ దాడిలో పోలీసులను సైతం కొట్టడంతో ఒక కానిస్టేబుల్ చావుబతుకుల మధ్య ఉన్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అమరావతిలో జరుగుతున్న అవినీతి, దోపిడీ బయటపడతాయనే భయంతోనే ప్రభుత్వం ఇలాంటి దాడులకు తెగబడుతోందని, రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పి ఆటవిక రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు.
రైతు వ్యతిరేక పాలన, కుంటుపడిన అభివృద్ధి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ మొదట నష్టపోయేది రైతులేనని బొత్స విమర్శించారు. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతుంటే, పండించిన పంటలకు గిట్టుబాటు ధర దక్కక రైతులు అల్లాడిపోతున్నారన్నారు. పక్క రాష్ట్రమైన కర్ణాటకలో కేంద్ర సబ్సిడీతో మామిడి కొనుగోలు చేస్తుంటే, ఇక్కడ మాత్రం మామిడి రైతులను కష్టాల్లోకి నెట్టేశారని, ‘వ్యవసాయం దండగ’ అన్న చంద్రబాబు నాయుడి పాత మాటలే ఇప్పుడు నిజమవుతున్నాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఉపాధి కల్పన లేదని, విశాఖలోని విలువైన భూములను పప్పుబెల్లల్లా పంచేస్తున్నారని ఆరోపించారు.
సంస్కృతికి విరుద్ధంగా బార్ల ఏర్పాటు
బీచ్లు, విమానాశ్రయాల్లో బార్లు పెట్టడం మన సంస్కృతీ సంప్రదాయాలకు విరుద్ధమని బొత్స హితవు పలికారు. బార్లు తెరిచి మద్యం అమ్మడమే సంపద సృష్టించడమా అని ప్రశ్నించారు. కనీసం సరైన దారి, నీటి సౌకర్యం లేని భోగాపురం ఎయిర్ పోర్టులో బారు పెడతామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇన్ని సమస్యలు పెట్టుకుని ప్రయాణికులపై యూజర్ ఛార్జీల భారం మోపడం సరికాదన్నారు.
Also Read: ట్రంప్, పుతిన్ వచ్చినా అంతే బాసూ.. నాని ట్వీట్లపై చిన్ని పంచ్!
రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై అభ్యంతరం
రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై బొత్స ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రథమ పౌరురాలైన రాష్ట్రపతికి ప్రభుత్వ గెస్ట్ హౌస్లలో కాకుండా ప్రైవేట్ హోటల్లో బస ఏర్పాటు చేయడం ఏంటని నిలదీశారు. ఇది ప్రైవేట్ సంస్థలకు దోచిపెట్టడమేనని, ప్రభుత్వ భవనాలు సరిగ్గా లేకపోతే ఆధునీకరించుకోవాలి తప్ప, ఇలాంటి నిర్ణయాలు దేశ పరువు, ప్రతిష్టలను భంగపరుస్తాయని స్పష్టం చేశారు.
సాయికృష్ణ లాకప్ డెత్.. సీబీఐ విచారణకు డిమాండ్
సాయికృష్ణ లాకప్ డెత్ ఘటన ఘోరమైన తప్పిదమని బొత్స పేర్కొన్నారు. ఈ కేసులో ఎంతటి వారు ఉన్నా వదిలిపెట్టకుండా కఠినంగా శిక్షించాలన్నారు. దీనిపై సమగ్రంగా సీబీఐ విచారణ జరిపించాలని గవర్నర్ను కలిసి ఇదివరకే కోరామని, రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా పోలీసులతో ఆటవిక పాలన సాగిస్తున్నారని, దీనిపై ప్రజల్లో త్వరలోనే తిరుగుబాటు వస్తుందని హెచ్చరించారు.
రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది: బొత్సా
రాష్ట్రంలో అరాచక పాలన, అడవి రాజ్యం నడుస్తోందని వైసీపీ నేత బొత్సా సత్యనారాయణ తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు తాము ఎంతో అభివృద్ధి చేశామని నిత్యం చెప్తుంటారని, అలాంటప్పుడు ప్రతిపక్షాలంటే అధికార పక్షానికి ఎందుకు అంత బెరుకు అని… pic.twitter.com/R0gWI2d69d
— BIG TV Breaking News (@bigtvtelugu) June 28, 2026