APSRTC: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రవాణా సంస్థ (ఏపీ పీటీడీ/ఆర్టీసీ)లో ప్రైవేటీకరణ సెగలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఆర్టీసీని ప్రైవేట్ వ్యక్తుల హస్తగతం చేసేందుకు ప్రభుత్వం వెనుకడుగు వేయడం లేదంటూ ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయవాడలో అత్యవసరంగా సమావేశమైన జేఏసీ నాయకులు, తమ డిమాండ్ల సాధన కోసం రెండో దశ ఉద్యమ కార్యాచరణను అధికారికంగా ప్రకటించారు. ప్రభుత్వ మొండివైఖరిని ఎండగడుతూ, ఉద్యోగుల హక్కుల రక్షణ కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని స్పష్టం చేశారు.
ప్రైవేటీకరణపైనే మా అభ్యంతరం: వై.శ్రీనివాసరావు
తాము పర్యావరణహితమైన ఎలక్ట్రికల్ బస్సుల రాకను వ్యతిరేకించడం లేదని, కానీ వాటిని ప్రైవేట్ ఆపరేటర్ల ద్వారా నడపాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నామని జేఏసీ కన్వీనర్ వై.శ్రీనివాసరావు స్పష్టం చేశారు. 2031 నాటికి అన్ని బస్సులను ఎలక్ట్రికల్ బస్సులుగా మారుస్తామన్న మంత్రి ప్రకటన కార్మికుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. ఒకపక్క ఖాళీలను భర్తీ చేయకుండా, మరోపక్క ‘స్త్రీ శక్తి’ పథకం వల్ల ఉద్యోగులపై పని ఒత్తిడి విపరీతంగా పెంచేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
రెండో దశ ఉద్యమ కార్యాచరణ షెడ్యూల్
ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు జేఏసీ ఖరారు చేసిన రెండో దశ నిరసనల ప్రణాళికను ప్రకటించారు. దీని ప్రకారం జూలై 7, 8 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల్లో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతారు. అనంతరం జూలై 9 నుండి 18 వరకు ప్రజాప్రతినిధులు (ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు) అందరికీ వినతి పత్రాలు సమర్పిస్తారు. జూలై 19, 20 తేదీల్లో విధుల్లో ఉన్న కార్మికులు, ప్రజల నుండి విస్తృతంగా సంతకాల సేకరణ చేపట్టి, జూలై 27న ఆ పత్రాలను జిల్లా కలెక్టర్ల ద్వారా నేరుగా ముఖ్యమంత్రికి పంపుతారు. జూలై నెలాఖరున మరోసారి జేఏసీ సమావేశమై, భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేస్తుంది.
Also Read: జేసీని మెంటల్ ఆస్పత్రిలో చేర్పించండి.. కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు!
డిపోల అప్పగింతపై దామోదర్ రావు ఆగ్రహం
మొదటి దశ నిరసనలను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ పలిశెట్టి దామోదర్ రావు ఆరోపించారు. ప్రైవేటీకరణ చేయడం లేదని పైకి చెబుతూనే, ఇప్పటికే 4 డిపోలను పూర్తిగా, మరో 8 డిపోల్లో 50 శాతం స్థలాన్ని ప్రైవేట్ ఎలక్ట్రికల్ ఆపరేటర్లకు కట్టబెట్టారని మండిపడ్డారు. కేవలం 1050 బస్సుల కోసమే పది డిపోలను దారాదత్తం చేశారని, రాబోయే రోజుల్లో మరో 1450 బస్సుల పేరుతో 29 డిపోలను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
స్త్రీ శక్తి బకాయిలు చెల్లించాలి
‘స్త్రీ శక్తి’ పథకానికి సంబంధించి ప్రభుత్వం నెలకు రూ.300 కోట్ల రీయింబర్స్మెంట్ ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.160 కోట్లే ఇస్తోందని దుయ్యబట్టారు. ఆ బకాయిలను ఆర్టీసీకి సక్రమంగా చెల్లిస్తే, ఇతర రాష్ట్రాల తరహాలో సంస్థే సొంతంగా ఎలక్ట్రికల్ బస్సులను కొనుగోలు చేసుకుంటుందని సూచించారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగిరాకపోతే, జూలై 30న మూడో దశ ప్రత్యక్ష ఉద్యమానికి శ్రీకారం చుడతామని ఆయన హెచ్చరించారు.