Vijaya Sai Reddy: వైసీపీ మాజీ నేత విజయ సాయిరెడ్డి పొలిటికల్ రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ గత రెండ్రోజులుగా ఏపీ రాజకీయాల్లో ప్రచారం జరుగుతోంది. వైసీపీని వీడి రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు గతంలోనే ప్రకటించిన విజయసాయి రెడ్డి.. మళ్లీ అదే పార్టీలో చేరతారా? లేదా కొత్త పార్టీ ప్రకటిస్తారా? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా విజయసాయిరెడ్డి ఆసక్తికర పోస్ట్ పెట్టారు. తన రాజకీయ పునః ప్రవేశం, భవిష్యత్ కార్యాచరణపై కీలక వ్యాఖ్యలు చేశారు.
విజయసాయిరెడ్డి తన ఎక్స్ పోస్టులో ఆసక్తికరంగా స్పందించారు. ‘నా రాజకీయ పునః ప్రవేశం, భవిష్యత్ ప్రణాళిక, కార్యాచరణ త్వరలో పాత్రికేయ మిత్రుల సమావేశంలో ప్రకటిస్తాను. నాది స్వతంత్ర భావజాలం. ఎలాంటి ఒత్తిళ్లకూ, ప్రలోభాలకు, ప్రభావాలకూ లోనుకాకుండా నిర్భయంగా రాష్ట్ర ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా ఆత్మగౌరవంతో నిర్ణయం తీసుకుంటాను’ అంటూ రాసుకొచ్చారు. అయితే ఎక్కడా రాజకీయ రీ-ఎంట్రీ వార్తలను ఖండించడం కానీ, తోసిపుచ్చడం గానీ చేయని నేపథ్యంలో ఆయన పాలిటిక్స్ లో వస్తున్నట్లు చెప్పకనే చెప్పారని ఏపీలో ప్రచారం మెుదలైంది.
నా రాజకీయ పునః ప్రవేశం, భవిష్యత్ ప్రణాళిక, కార్యాచరణ త్వరలో పాత్రికేయ మిత్రుల సమావేశంలో ప్రకటిస్తాను. నాది స్వతంత్ర భావజాలం. ఎలాంటి ఒత్తిళ్లకూ, ప్రలోభాలకు, ప్రభావాలకూ లోనుకాకుండా నిర్భయంగా రాష్ట్ర ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా ఆత్మగౌరవంతో నిర్ణయం తీసుకుంటాను.@TV9Telugu…
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 5, 2026
అయితే ఈ ట్వీట్ కు ముందు వరకూ విజయసాయిరెడ్డి తిరిగి వైసీపీలోకే ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ కొంత ప్రచారం జరిగింది. గతంలో లాగానే జగన్ పక్కన చేరి కీలక బాధ్యతలు నిర్వరిస్తారని రాజకీయ వర్గాలు అంచనా వేశాయి. మరికొందరు మాత్రం ఆయన బీజేపీలో చేరబోతున్నట్లు అభిప్రాయపడ్డారు. కానీ విజయసాయిరెడ్డి ట్వీట్ వచ్చాక.. ఆయన సొంతంగా ఒక రాజకీయ పార్టీని పెట్టే యోచనలో ఉన్నట్లుగా కొత్త విశ్లేషణలు తెరపైకి వచ్చాయి. ఎందుకంటే తనది స్వతంత్ర భావజాలమని.. ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గే మనిషిని కాదని తాజా ట్వీట్ లో విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అయితే జగన్ చుట్టూ కోటరి ఉందని.. వారిని దాటుకొని తన మాటలు జగన్ చెవికి చేరట్లేదని గతంలోనే ఆయన చెప్పారు. దీన్నిబట్టి స్వతంత్రంగా కొత్త పార్టీ వైపే తన అడుగులు ఉండబోతున్నట్లు విజయసాయి రెడ్డి చెప్పకనే చెప్పారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
Also Read: మోదీ వీడియో డిలీట్ వివాదం.. దెబ్బకు దిగొచ్చిన మెటా.. కేంద్రానికి జుకర్బర్గ్ సారీ!
అయితే కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించి విజయసాయిరెడ్డి ఇప్పటికే కసరత్తు కూడా ప్రారంభించినట్లు ఏపీలో చర్చ జరుగుతోంది. పార్టీ నిర్మాణానికి సంబంధించి.. జిల్లా, నియోజకవర్గ స్థాయిలో తనతో సన్నిహితంగా ఉన్న ముఖ్యనేతలతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా ప్రచారం సాగుతోంది. వైసీపీలోని అసమ్మతి వర్గాన్ని, తటస్థులను కొత్త పార్టీ పెట్టి తన వైపునకు తిప్పుకోవాలన్న యోచనలో విజయసాయిరెడ్డి ఉన్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ ప్రస్తుతానికి ప్రచారాలు మాత్రమే. త్వరలో ప్రెస్ మీట్ పెడతానని విజయసాయిరెడ్డి స్వయంగా ప్రకటించిన నేపథ్యంలో.. రాజకీయంగా ఎలాంటి డెసిషన్ తీసుకుంటారన్నది ఆసక్తిరేపుతోంది.
Also Read: ఇదేందయ్యా ఇది.. స్కూటీ రేటు రూ.లక్ష.. పెండింగ్ చలాన్లు మాత్రం రూ.10 లక్షలు!