Terror Links Case: విజయవాడలో ఇటీవల వెలుగు చూసిన ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాల కేసులో దర్యాప్తు సంస్థలు విస్తుపోయే నిజాలను బయటపెట్టాయి. ఈ మొత్తం వ్యవహారంలో హైదరాబాద్కు చెందిన సైదా బేగం కీలక సూత్రధారిగా వ్యవహరించినట్లు విచారణలో తేలింది. కేవలం పురుషులకే పరిమితం అనుకున్న ఈ నెట్వర్క్లో, మహిళలను భాగస్వామ్యం చేస్తూ వారిని ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు జరుగుతున్న కుట్రలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మతం పేరుతో విషం చిమ్ముతూ, యువతను పెడదోవ పట్టించేలా ఈమె భారీ నెట్వర్క్ను నడిపినట్లు అధికారులు గుర్తించారు.
మహిళా రిక్రూట్మెంట్ టార్గెట్..
సైదా బేగం విచారణలో అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే, ఆమెకు అప్పగించిన విదేశీ ఉగ్రవాద సంస్థల టార్గెట్. మహిళలను రిక్రూట్ చేసి వారిని జిహాదీ మార్గంలోకి తీసుకురావడమే ఈమె ప్రధాన కర్తవ్యం. ఇప్పటివరకు సుమారు 42 మంది యువతులను ఆమె తన వలలో వేసుకున్నట్లు సమాచారం. వీరికి ‘మదర్సా’ ముసుగులో ప్రాథమిక మత శిక్షణ ఇచ్చి, ఆపై ఆయుధ విద్యపై అవగాహన కల్పించేలా ప్రణాళికలు రూపొందించారు. కేవలం ఆలోచనలతోనే ఆపకుండా, క్షేత్రస్థాయిలో వారిని సిద్ధం చేసేందుకు సన్నాహాలు చేయడం గమనార్హం.
‘KHAWATEEN’ వాట్సాప్ గ్రూప్..
సాంకేతికతను వాడుకుంటూ సైదా బేగం తన కార్యకలాపాలను అత్యంత రహస్యంగా నిర్వహించింది. ‘KHAWATEEN’ పేరుతో ప్రత్యేకంగా ఒక వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేసి, యువతులకు జిహాదీ సిద్ధాంతాలను నూరిపోసేది. దీనికి తోడు ఇన్స్టాగ్రామ్లో ఏకంగా 40కి పైగా నకిలీ అకౌంట్లు నిర్వహిస్తూ విద్వేషపూరిత వీడియోలను షేర్ చేసింది. ఒసామా బిన్ లాడెన్, జకీర్ నాయక్ వంటి వ్యక్తుల ప్రసంగాలతో యువతను ఆకర్షించడం ఈమె స్టైల్. దర్యాప్తులో భాగంగా ఈమె మొబైల్ నుంచి భారీ సంఖ్యలో ఉగ్రవాద సాహిత్యానికి సంబంధించిన PDF ఫైళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఆయుధ శిక్షణకు సన్నాహాలు.. పెను ప్రమాదం తప్పిందా?
ఈ ముఠా కేవలం ఆన్లైన్ ప్రచారానికే పరిమితం కాలేదు. మతపరమైన బోధనలు పూర్తయిన తర్వాత, ఎంపిక చేసిన మహిళలకు వెపన్ ట్రైనింగ్ ఇవ్వాలని పైస్థాయి నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. యువతను ఉగ్రవాద బాట పట్టించి, దేశ విచ్ఛిన్నకర శక్తులకు అనుకూలంగా మార్చేందుకు పెద్ద ఎత్తున నిధులు కూడా అందినట్లు అనుమానిస్తున్నారు. సకాలంలో అధికారులు అప్రమత్తమై సైదా బేగంను అదుపులోకి తీసుకోవడంతో ఒక పెద్ద విధ్వంసకర కుట్ర ముందే భగ్నమైందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అప్రమత్తంగా ఉండాల్సిందే!
విజయవాడ కేంద్రంగా సాగిన ఈ చీకటి దందా, సామాజిక మాధ్యమాల్లో పొంచి ఉన్న ప్రమాదాలను మరోసారి గుర్తుచేస్తోంది. అమాయక యువతను లక్ష్యంగా చేసుకుని విదేశీ శక్తులు ఇలాంటి స్లీపర్ సెల్స్ ద్వారా దేశంలో అలజడి సృష్టించాలని చూస్తున్నాయి. ఈ ఉగ్ర లింకుల కేసులో మరికొంత మంది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. డిజిటల్ ప్లాట్ఫామ్స్లో అపరిచితుల పట్ల, అనుమానాస్పద గ్రూపుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భద్రతా దళాలు హెచ్చరిస్తున్నాయి.
Also Read: మహిళలను కించపరచడం జర్నలిజమా? అంటూ రాధాకృష్ణ వ్యాఖ్యలపై జగన్ ఫైర్