Gitam University Land Row: విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీ పరిధిలో ఉన్న సుమారు 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవ్వడం తీవ్ర చర్చకు దారితీసింది. దాదాపు రూ. 5,000 కోట్ల విలువైన ఈ భూములను ప్రస్తుత విశాఖ ఎంపీ భరత్కు చెందిన విద్యాసంస్థలకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రతిపక్ష వైసీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే, ఈ నెల 30న జరిగే జీవీఎంసీ (GVMC) కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాన్ని అజెండాగా చేర్చి, తీర్మానం ద్వారా ప్రభుత్వానికి పంపాలనే ప్రతిపాదనపై రాజకీయ దుమారం రేగుతోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించేందుకు వైసీపీ అగ్రనేతలు రంగంలోకి దిగారు. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, రీజినల్ కోఆర్డినేటర్ కన్నా బాబు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తదితర ముఖ్య నేతల బృందం గీతం క్యాంపస్ సందర్శనకు పిలుపునిచ్చింది. అయితే, ఈ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేస్తూ, గీతం ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలల వద్ద భారీగా మోహరించారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి, వైసీపీ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
నిన్ననే వైసీపీ కార్పొరేటర్లతో సమావేశమైన బొత్స సత్యనారాయణ బృందం, జీవీఎంసీ జాయింట్ కమిషనర్ను కలిసి తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ప్రజా ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడం సరికాదని, వెంటనే ఈ అంశాన్ని కౌన్సిల్ అజెండా నుండి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తే, రేపు జరగబోయే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం వద్ద భారీ ఎత్తున నిరసనలు చేపడతామని వైసీపీ శ్రేణులు హెచ్చరించాయి.
మరోవైపు, ఈ భూముల క్రమబద్ధీకరణ అంశంపై అధికార కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ నేతలు ఇంకా మౌనంగానే ఉండటం గమనార్హం. గతంలో ఇదే భూముల విషయంలో ఆక్రమణలు జరిగాయంటూ గత ప్రభుత్వం కొన్ని కట్టడాలను కూల్చివేసిన ఉదంతం ఉండటంతో, ఇప్పుడు అదే స్థలాలను రెగ్యులరైజ్ చేయాలనుకోవడంపై పౌర సమాజంలోనూ చర్చ మొదలైంది. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత ఉన్న వారే ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: తిరుమలలో కొత్తజంటకు అదేం పని.. రకరకాల భంగిమల్లో షూట్, ఆపై భక్తుల ఆగ్రహం
ప్రస్తుతం విశాఖలో పోలీసుల ఆంక్షలు, వైసీపీ నేతల ఆందోళనలతో గీతం యూనివర్సిటీ పరిసర ప్రాంతాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఈ నిరసనలో పాల్గొంటుండటంతో, ఈ వివాదం కేవలం భూములకే పరిమితం కాకుండా రాజకీయ బలప్రదర్శనగా మారింది. రాబోయే 24 గంటల్లో జీవీఎంసీ కౌన్సిల్ తీసుకోబోయే నిర్ణయం ఈ వివాదాన్ని మరిన్ని మలుపులు తిప్పే అవకాశం కనిపిస్తోంది.