Visakhapatnam: విశాఖపట్నం నగరంలో నేర నియంత్రణ, ప్రజాభద్రత, ట్రాఫిక్ నిర్వహణలో తీసుకుంటున్న చర్యలపై.. విశాఖ పోలీస్ కమిషనర్ సమగ్ర వార్షిక నేర సమీక్ష వివరాలను విడుదల చేశారు. నేరాల నియంత్రణతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తూ విశాఖను మరింత సురక్షిత నగరంగా తీర్చిదిద్దే దిశగా.. పోలీసులు ముందుకెళ్తున్నారని కమిషనర్ స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, కొత్త సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి విశాఖ నగరంలో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థను అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ఈ ఆధునిక సాంకేతిక వ్యవస్థను ప్రవేశపెడుతున్నామని తెలిపారు. సిగ్నల్స్, కెమెరాలు, డేటా విశ్లేషణ ద్వారా ట్రాఫిక్ను మరింత సమర్థవంతంగా నియంత్రిస్తామని వెల్లడించారు.
నేర గణాంకాల విషయానికి వస్తే, హత్యల సంఖ్యలో పెరుగుదల ఆందోళన కలిగిస్తోందని కమిషనర్ పేర్కొన్నారు. గత ఏడాది 24 హత్యలు నమోదుకాగా, ఈ ఏడాది ఆ సంఖ్య 35కు పెరిగిందని తెలిపారు. అయితే అత్యాచారాల కేసుల్లో గణనీయమైన తగ్గుదల నమోదైందని చెప్పారు. గత ఏడాది 126 హత్యాచార కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 63 కేసులు మాత్రమే నమోదయ్యాయని, అంటే దాదాపు 50 శాతం తగ్గుదల వచ్చిందని వివరించారు. ఇది మహిళల భద్రతపై పోలీసులు తీసుకున్న చర్యలకు నిదర్శనమని అన్నారు.
సైబర్ నేరాలపై విశాఖ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు కమిషనర్ తెలిపారు. ఈ ఏడాది మొత్తం 1020 సైబర్ క్రైమ్ కేసులను పరిష్కరించామని చెప్పారు. అలాగే, లోన్ యాప్ మోసాలపై ప్రత్యేక చర్యలు తీసుకుని 126 మంది బాధితులకు సుమారు రూ.56 లక్షలను రికవరీ చేశామని వెల్లడించారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
దొంగతనాల విషయంలోనూ విశాఖ పోలీసులు కీలక విజయాలు సాధించారు. నగరంలో నమోదైన 4959 దొంగతన కేసుల్లో బాధితులకు రూ.10.56 కోట్ల విలువైన ఆస్తిని తిరిగి అందించామని కమిషనర్ తెలిపారు. నేరస్తులను పట్టుకోవడంలో సాంకేతికతతో పాటు ప్రజల సహకారం ఎంతో కీలకంగా మారిందని పేర్కొన్నారు.
మాదకద్రవ్యాల నిర్మూలనకు విశాఖ పోలీసులు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని కమిషనర్ చెప్పారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై 40 కేసులు నమోదు చేసి 10.147 కేజీల గంజాయి, 19.2 లీటర్ల యష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడటమే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
నగర భద్రతలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా విశాఖలో 13 వేల సీసీ కెమెరాలను ప్రజల సహకారంతో ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలిపారు. అదేవిధంగా, నగరంలోని 22 పోలీస్ స్టేషన్ పరిధుల్లో 15 డ్రోన్లను వినియోగిస్తూ నిఘా పెంచామని చెప్పారు. డ్రోన్ నిఘా ద్వారా 453 కేసులు నమోదు చేసినట్లు వివరించారు.
పోలీస్ సిబ్బంది సంక్షేమంపై కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని కమిషనర్ తెలిపారు. విశాఖ నగర పోలీసు విభాగానికి చెందిన 2576 మంది సిబ్బందికి రూ.30 లక్షల చొప్పున భీమా సదుపాయం కల్పించామని చెప్పారు.
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది రూ.17 కోట్ల విలువైన చలానాలు విధించడంతో పాటు సుమారు లక్ష మంది డ్రైవింగ్ లైసెన్సులను సస్పెండ్ చేశామని తెలిపారు. రోడ్డు భద్రతే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
Also Read: వైసీపీకి కలిసిరాని 2025.. పార్టీ ఇమేజ్ ఫుల్ డ్యామేజ్, చివర్లో రప్పా రప్పా కూడా
సైబర్ క్రైమ్ నియంత్రణలో విశాఖ పోలీసులకు రాష్ట్రస్థాయిలో ‘ఏబీసీడీ అవార్డు’ లభించిందని కమిషనర్ గర్వంగా వెల్లడించారు. ఇది విశాఖ పోలీసుల కృషికి గుర్తింపుగా నిలుస్తుందని తెలిపారు.