Nara Lokesh: ప్రపంచ వాణిజ్య కేంద్రం (World Trade Center) మౌలిక సదుపాయాలు కలిగిన నగరాల సరసన విశాఖపట్నం (Visakhapatnam) చేరనుంది. రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, హెచ్ఆర్డి శాఖ మంత్రి నారా లోకేష్ గురువారం యెండదలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణానికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. హైదరాబాద్కు చెందిన కపిల్ గ్రూప్ ( Kapil Group) 7.5 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ సెంటర్ను అభివృద్ధి చేస్తోంది. ఇది వ్యాపార నెట్వర్కింగ్, కన్సల్టింగ్, ట్రేడ్ సేవలు, మార్కెట్ యాక్సెస్ సపోర్ట్ కోసం సిద్ధంగా మౌలిక సదుపాయాలను అందిస్తుంది.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, WTC ప్రాజెక్టును 24 నెలల్లోగా పూర్తి చేసి, అందుబాటులోకి తేవాలని డెవలపర్కు లక్ష్యం నిర్దేశించారు. పనుల పురోగతిని క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తామని, వేగంగా పూర్తి చేస్తే కొత్త అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. గూగుల్ ఏఐ డేటా సెంటర్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి పెద్ద ప్రాజెక్టులతో పాటు అనేక ఐటీ పార్కులు వస్తుండటంతో విశాఖ అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తుందన్నారు. WTC రాకతో ఫార్చ్యూన్ 500 కంపెనీలు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు నగరానికి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐటీ, ఐటీఈఎస్, అనుబంధ రంగాల్లో 5 లక్షల ఉద్యోగాలు సృష్టించడమే లక్ష్యమని లోకేష్ స్పష్టం చేశారు.
Read Also: CM Chandrababu: భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా.. ఇటలీ రాయబారితో సీఎం చంద్రబాబు భేటీ
అంతకుముందు, మంత్రి ఐటీ హిల్ నెం. 3లో సెయిల్స్ సాఫ్ట్వేర్ యొక్క ‘అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ ఇన్నోవేషన్ అండ్ ఏఐ ఎక్సలెన్స్ సెంటర్’కు శంకుస్థాపన చేశారు. ఐటీ హిల్ నెం. 2లో ఐస్పేస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ (ఏఐ, బీపీఓ, హెల్త్కేర్), టెక్ తమ్మిన (లో-కోడ్, ఏఐ), ఫీనామ్ గ్లోబల్ డెవలప్మెంట్ సెంటర్ (ఏఐ పరిశోధన) కొత్త కార్యాలయాలను ప్రారంభించారు. అలాగే, రూ. 2,172 కోట్ల పెట్టుబడి, 8,000 ఉద్యోగాల లక్ష్యంతో రాహేజా ఐటీ స్పేస్, లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ను కూడా మంత్రి లోకేష్ ప్రారంభించారు.