Vizag Drugs Case: నూతన సంవత్సర వేడుకలకు (New Year Celebrations) మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉండటంతో విశాఖపట్నంలో ‘మత్తు’ ముఠాలు రెచ్చిపోతున్నాయి. పోలీసులు ఎంత నిఘా పెంచినా, కేటుగాళ్లు కొత్త మార్గాల్లో డ్రగ్స్ను నగరంలోకి చేరవేస్తున్నారు. తాజాగా లాసన్స్ బే కాలనీలో (Lawson’s Bay Colony) గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలు పట్టుబడటం నగరంలో కలకలం రేపుతోంది.
న్యూ ఇయర్ సందర్భంగా నగరంలో డ్రగ్స్ రవాణా జరుగుతోందన్న పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో లాసన్స్ బే కాలనీ పరిధిలో ఒక డియో బైక్పై అనుమానాస్పదంగా వెళ్తున్న ముగ్గురు యువకులను అడ్డగించారు. వారిని సోదా చేయగా.. భారీగా గంజాయి మరియు ఇతర నిషేధిత మత్తు పదార్థాలు బయటపడ్డాయి. వెంటనే పోలీసులు ఆ సామాగ్రిని స్వాధీనం చేసుకుని, ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు. నిందితులను వినయ్, సాయి, శ్యామ్లుగా గుర్తించారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ గ్యాంగ్లో ప్రధాన నిందితుడైన వినయ్.. ఈ మత్తు పదార్థాలను బెంగళూరు నుంచి తీసుకువచ్చినట్లు పోలీసులు గుర్తించారు. న్యూ ఇయర్ పార్టీల కోసం, యువతను టార్గెట్ చేసుకుని వీటిని విశాఖకు తరలించినట్లు అనుమానిస్తున్నారు. కేవలం గంజాయే కాకుండా, సింథటిక్ డ్రగ్స్ ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
కొత్త సంవత్సరం వేడుకల పేరుతో మత్తు జోలికి వెళ్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే నగరవ్యాప్తంగా స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయని, పార్టీల ముసుగులో డ్రగ్స్ వినియోగిస్తే జైలు పాలవ్వక తప్పదని స్పష్టం చేశారు. ఈ ఘటనతో తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై నిఘా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని పోలీసులు సూచిస్తున్నారు.
Read Also: న్యూ ఇయర్ వేడుకల వేళ రోడ్లపై వేషాలు వేస్తే తాట తీస్తా: సీపీ సజ్జనార్