పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం యనమదుర్రు గ్రామంలో భారీ కొండచిలువ బయటపడటంతో స్థానికుల్లో తీవ్ర కలకలం రేగింది. గ్రామంలోని ఒక డ్రైనేజీ కాలువలో నుంచి పొలం లోకి ఇంజన్ ద్వారా నీటిని తోడుతున్న సమయంలో అకస్మాత్తుగా సుమారు 20 అడుగుల పొడవైన భారీ కొండచిలువ బయటకు వచ్చింది. ఒక్కసారిగా కొండచిలువను చూసిన రైతులు, స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. కొందరు పరుగులు తీశారు.
అయితే జనసందోహాన్ని గమనించిన కొండచిలువ వెంటనే డ్రైనేజీ పక్కన ఉన్న పైపు మార్గంలోకి వెళ్లిపోయింది. దీంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలిసిన వెంటనే స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది కొండచిలువను పట్టుకునేందుకు ప్రయత్నించారు.
డ్రైనేజీ వ్యవస్థలో కొండచిలువ ఉండటంతో పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పిల్లలు, పశువులను డ్రైనేజీ వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. కొండచిలువను సురక్షితంగా పట్టుకుని అటవీ ప్రాంతానికి తరలించే చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో యనమదుర్రు గ్రామంలో కొంతసేపు భయాందోళన వాతావరణం నెలకొంది.