Prathipadu Temple Issue: ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి కొరడా ఝుళిపించారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారన్న కారణంతో పెంటపాడు మండలంలోని నలుగురు కీలక అధికారులను సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెవెన్యూ, పంచాయతీ రాజ్ అధికారులే కాకుండా పోలీసు అధికారులపైనా చర్యలకు సిఫార్సు చేయడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
పెంటపాడు మండలం ప్రత్తిపాడు గ్రామంలో జిల్లా పరిషత్కు (ZP Land) చెందిన సుమారు 15 సెంట్ల ప్రభుత్వ స్థలం ఉంది. అయితే, ఈ స్థలంలో గ్రామస్తులు కొందరు ఆలయ నిర్మాణం చేపట్టారు. ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని అభ్యంతరం వ్యక్తం చేస్తూ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ను విచారించిన హైకోర్టు.. తక్షణం ఆ ప్రభుత్వ భూమిని రక్షించాలని, తదుపరి నిర్మాణాలు జరగకుండా చూడాలని అధికారులను స్పష్టంగా ఆదేశించింది.
అయితే, హైకోర్టు ఉత్తర్వులను క్షేత్రస్థాయి అధికారులు సీరియస్గా తీసుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా సదరు స్థలంలో గుడి నిర్మాణం పూర్తవ్వడమే కాకుండా, అందులో విగ్రహాల ప్రతిష్ఠాపన కూడా జరిగిపోయింది. కోర్టు ఆదేశాలు అమలు కాకపోవడంతో పిటిషనర్లు మరోసారి హైకోర్టు మెట్లెక్కారు. అధికారుల తీరుపై కోర్టు ధిక్కరణ (Contempt of Court) కింద పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ఏకంగా జిల్లా కలెక్టర్ నాగరాణిని కూడా ప్రతివాదిగా చేర్చడం కలకలం రేపింది. ఈ పిటిషన్ను జనవరి 5న కోర్టు విచారించనుంది.
కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో విఫలమవ్వడమే కాకుండా, తనను కోర్టులో నిలబెట్టే పరిస్థితి తలెత్తడంతో కలెక్టర్ నాగరాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో తీవ్ర అలసత్వం వహించిన పెంటపాడు తహసీల్దార్, ఈవోపిఆర్డీ (EOPRD), పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో (VRO)లను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అంతేకాకుండా, అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంలో విఫలమైన పోలీసు అధికారులపైనా చర్యలకు ఉపక్రమించారు. తాడేపల్లిగూడెం రూరల్ సీఐ, పెంటపాడు ఎస్ఐలను సస్పెండ్ చేయాలని కోరుతూ జిల్లా ఎస్పీకి కలెక్టర్ లేఖ రాశారు. కోర్టు ఆదేశాల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఈ చర్య ద్వారా కలెక్టర్ స్పష్టం చేశారు.
Read Also: CM Chandrababu: రాజకీయ ముసుగులో రౌడీయిజం సాగనివ్వం.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు