Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎంతో మంది ఎదురుచూస్తుంటారు. నిత్యం వేల సంఖ్యలో శ్రీవారిని దర్శించుకుంటారు. దీంతో సైబర్ కేటుగాళ్ల కన్ను శ్రీవారి భక్తులపై పడింది. దీంతో ఏపీ ప్రభుత్వం వృద్ధులకు ఉచిత దర్శనం కల్పిస్తుందంటూ ఓ ఫేక్ వార్తను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
“ఏపీ సీఎం చంద్రబాబు వృద్ధుల కోసం ఉచిత తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శన పథకం ప్రారంభించారు. 65 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధులు అర్హులు.
ప్రతి రోజు ఉదయం 10:00 గంటలకు, మధ్యాహ్నం 3:00 గంటలకు వృద్ధులకు ఉచిత దర్శనాలు కల్పిస్తున్నారు. మీరు కౌంటర్ S-1 వద్ద మీ ఫొటో గుర్తింపు కార్డు, వయస్సు ధృవీకరణ పత్రం చూపితే సరిపోతుంది, అరగంటలో దర్శనం పూర్తవుతుంది” అంటూ ఓ ఫేక్ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
వృద్ధులకు ఉచిత దర్శనంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. టీటీడీ ఈ ప్రచారాన్ని ఖండించింది. వృద్ధుల కోసం ఎలాంటి కొత్త ఉచిత దర్శన పథకాన్ని ప్రారంభించలేదని పేర్కొంది. భక్తులు టీటీడీ అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని తెలిపింది. ఈ మేరకు టీటీడీ ప్రకటన చేసింది. తిరుమల దర్శనాల విషయంలో ఫేక్ న్యూస్, మెసేజ్లను నమ్మొద్దని భక్తులకు సూచించింది. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్, యాప్, సోషల్ మీడియా అధికారిక ఖాతాల ద్వారా విడుదలైన ప్రెస్నోట్లు, సమాచారాన్ని, అధికారిక ప్రకటనల్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని కోరింది. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని భక్తుల్ని కోరింది. వృద్ధుల కోసం ఎలాంటి కొత్త పథకాన్ని ప్రారంభించలేదని టీటీడీ క్లారిటీ ఇచ్చింది.
Also Read: CM Chandrababu: రాజకీయ ముసుగులో రౌడీయిజం సాగనివ్వం.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు