ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటనపై ప్రతిపక్ష వైసీపీ మరోసారి విషం కక్కింది. ప్రస్తుతం ఏపీ తెలంగాణ మధ్య నదీ జలాల అంశంలో పెద్దఎత్తున మాటల యుద్ధం నడుస్తున్న విషయాన్ని ఈ సందర్బంగా ప్రస్తావించింది.పవన్కు తెలంగాణ మీద ఉన్న ప్రేమ ఓట్లు వేసి గెలిపించిన ప్రజల మీద లేకుండా పోయిందని విమర్శలు చేస్తున్నది. ఇదే విషయాన్ని వైసీపీ సోషల్ మీడియా విభాగం వారు పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన కూటమి నేతలు వైసీపీ ఆరోపణలకు ఘాటుగా బదులిస్తున్నారు. గతంలో కేసీఆర్, వైఎస్ జగన్ ఎంత సన్నిహితంగా ఉన్నారో అప్పటి విజువల్స్ను ప్రదర్శిస్తూ ఓ రేంజులో ఆటాడుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్ తెలంగాణకు వచ్చిన విషయం వేరు. ఆయన ఇక్కడ తెలంగాణ రాజకీయ నాయకులతో ఆయన ఏమాత్రం భేటీ కాలేదు. కేవలం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు అంజనేయ స్వామి ఆలయానికి వెళ్లారు. అది కూడా తన వ్యక్తిగత దర్శనం కోసం. ఈ సందర్భంగా ఆయనతో పాటు టీటీడీ చైర్మన్ కూడా ఉన్నారు. అక్కడికి వెళ్లిన ముఖ్యమైన కారణం.. టీటీడీ తరఫున కొండగట్టులో రూ.35 కోట్ల నిధులతో ఆలయ అభివృద్ధికి సహకరించారు. అతిథి గృహాల నిర్మాణానికి టీటీడీ తరఫున సాయం ప్రకటించారు. ఇలా చేయడం వలన రెండు రాష్ట్రాల భక్తులకు మేలు కలుగుతుంది.టీటీడీ ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా ఆలయాలు నిర్మిస్తున్నది. కరీంనగర్లోనూ టీటీడీ ఆలయ నిర్మాణానికి ఇదివరకే నిర్ణయం జరిగింది. ఇలా చేయడం వలన టీటీడీకే ఆదాయం సమకూరుతుంది.
కొండగట్టు అంజన్న దర్శనాంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే తనకు అపారమైన భక్తి, నమ్మకం అని చెప్పారు. ఏపీలో ఎన్నికలకు ముందు పవన్ తన ఎన్నికల ప్రచారం వాహనం ‘వారాహి ’కి ఇక్కడే ప్రత్యేకంగా పూజలు చేయించారు.ఆ సమయంలో హైటెన్షన్ వైర్ తన తలకు తగిలినా తనకు ఏం కాలేదని.. అదంతా ఆంజనేయ స్వామి కృప వలనే అని చాలా సార్లు చెప్పుకొచ్చారు. ఆనాడు అర్చకులు తనకు కొన్ని విన్నపాలు చేశారని.. ఆ విషయమై నేడు వారికి సాయం చేసేందుకు వచ్చానని చెప్పారు. ఇదిలాఉంటే పవన్ పర్యటనపై వైసీపీ విషం కక్కడం మొదలెట్టింది.
KTR on CM Revanth: సీఎం రేవంత్ రాబందులా మారారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఏటా తెలంగాణ నుంచే కాదు.. దేశవ్యాప్తంగా భక్తులు తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి వస్తుంటారు. కానుకలు సైతం ఇస్తుంటారు. అలాంటిది టీటీడీ సొమ్ముతో కొండగట్టులో అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే తప్పేంటని.. పవన్ రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు మెరుగుపరచడానికే ఇలా చేశారని కూటమి నేతలు మెచ్చుకుంటున్నారు. గత వైసీపీ, బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఒప్పందాలపైనే ఇప్పుడు చర్చ జరుగుతున్నదని.. అందుకు పవన్ను విమర్శించడం సరికాదని పేర్కొంటున్నారు. సీఎం చంద్రబాబు సైతం రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధిని తాను కోరుకుంటానని పలుసందర్భాల్లో చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఊటంకిస్తున్నారు. నదీ జలాల అంశాన్ని రెండు తెలుగు రాష్ట్రాల అధికారులు, కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ, సీఎంలు చూసుకుంటారని.. ఇకపై చీప్ పాలిటిక్స్ చేయొద్దని వైసీపీ నేతలకు కూటమి నేతలు హితవు పలికారు.