YCP Leaders: వైసీపీ అధిష్టానం క్రమశిక్షణకు పెద్దపీట వేస్తున్నట్లు మరోసారి రుజువు చేసింది. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గానికి చెందిన నలుగురు కీలక నేతలపై పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ నిబంధనలు ఉల్లంఘిస్తూ, క్షమశిక్షణారాహిత్యంగా వ్యవహరించారనే కారణంతో.. ఈ చర్యలు తీసుకున్నట్లు పార్టీ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి.
సస్పెండ్ అయిన వారిలో వడమలపేట ఎంపీపీ విజయలక్ష్మి, అత్తూరు ఎంపీటీసీ దుర్గాదేవి, ఆరూరు ఎంపీటీసీ ఎం. రమ్య, బూచివనత్తం ఎంపీటీసీ డి. రాజ్గోపాల్ ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వీరు, పార్టీ మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించారని అధిష్టానం నిర్ధారించినట్లు సమాచారం. ఇటీవలి కాలంలో వీరి ప్రవర్తనపై పార్టీకి అనేక ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ విభాగం పూర్తి స్థాయిలో విచారణ చేపట్టింది. సంఘటనల వివరాలు, స్థానిక నేతల అభిప్రాయాలు, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని.. అధిష్టానం స్పష్టమైన సంకేతాలు ఇచ్చిందని పలువురు చెబుతున్నారు.
ఈ సస్పెన్షన్ నిర్ణయం వైసీపీలో అంతర్గతంగా చర్చనీయాంశంగా మారింది. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా, క్రమశిక్షణ విషయంలో రాజీ పడబోమన్న సందేశాన్ని జగన్ మరోసారి బలంగా పంపారని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
Also Read: శ్రీకాకుళం వాసులకు గుడ్ న్యూస్.. కీలక హాల్ట్ లకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్
పార్టీ క్రమశిక్షణను నిలబెట్టేందుకు తీసుకున్న ఈ నిర్ణయంపై.. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీలో అసంతృప్తి కలిగిన నేతల చలనం పెరగడంతో, పార్టీ ఉన్నతస్థాయి నిర్ణయం తీసుకుని ఇలా కఠిన చర్యలు చేపట్టింది. పార్టీ క్రమశిక్షణకు భంగం కలిగించేవారిపై సహనం ఉండదన్న సాంకేతాన్ని వైసీపీ స్పష్టంగా పంపుతోంది.