YS Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ పాదయాత్ర అస్త్రాన్ని ప్రయోగించబోతున్నారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఏలూరు నియోజకవర్గ కేడర్తో జరిగిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై జగన్ దిశానిర్దేశం చేస్తూ, “నేను మరో ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర మొదలుపెడతాను. ఆపై సుమారు ఏడాదిన్నర పాటు నిరంతరం ప్రజల మధ్యే ఉంటాను” అని స్పష్టం చేశారు.
కూటమి ప్రభుత్వంపై ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని, కేడర్ అంతా ధైర్యంగా ప్రజల్లో ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి ఇంకా మూడేళ్ల గడువు మాత్రమే మిగిలి ఉందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుత పాలనపై ప్రజల్లో జరుగుతున్న చర్చను జగన్ ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. “జగన్ ఉంటేనే బాగుండేది, ఆయన మాట ఇస్తే నిలబెట్టుకునేవాడు, ప్రతి నెలా బటన్ నొక్కి అన్నీ ఇచ్చేవాడు అని ప్రతి ఇంట్లో అనుకుంటున్నారు” అని జగన్ పేర్కొన్నారు. తన హయాంలో రెండేళ్లు కోవిడ్ కష్టాలు ఉన్నప్పటికీ ఏ ఒక్క పథకాన్ని ఆపలేదని, చంద్రబాబు మాదిరిగా అబద్ధాలు చెప్పడం తమకు తెలియదని ఆయన వ్యాఖ్యానించారు.
కూటమి పాలనలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు కుప్పకూలాయని జగన్ విమర్శించారు. “గతంలో ప్రభుత్వ స్కూళ్లలో 43 లక్షల మంది చదివితే, నేడు ఆ సంఖ్య 33 లక్షలకు పడిపోయింది. గవర్నమెంట్ స్కూళ్లు పూర్తిగా కళ తప్పాయి.” అని అన్నారు. సుమారు రూ. 5,600 కోట్లు పెండింగ్లో పెట్టి, కేవలం రూ. 700 కోట్లు మాత్రమే ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీని కనుమరుగు చేశారని, 108, 104 సర్వీసులను పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ప్రస్తుతం ఫోన్ చేస్తే 108 వాహనం రావడానికి మూడు గంటలు పడుతోందని విమర్శించారు.
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ దుర్వినియోగం అవుతోందని జగన్ ఆరోపించారు. “ప్రస్తుతం రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారు. కండకావరంతో ఎవరినైనా ఏదైనా చేయొచ్చు అన్నట్లు వ్యవహరిస్తున్నారు” అని ఆయన మండిపడ్డారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా వైఎస్సార్సీపీ జెండా పట్టుకుని అండగా నిలబడాలని, ప్రతి వారం ఒక నియోజకవర్గ కార్యకర్తలతో తాను స్వయంగా భేటీ అవుతానని జగన్ ప్రకటించారు.
Read Also: చికిత్స కోసం వెళ్తే చితికి చేర్చారు.. మందుల చీటీ తారుమారు.. వృద్ధుడి దుర్మరణం