YS Jagan: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందుల రెండో రోజు పర్యటన తాత్కాలికంగా వాయిదా పడింది. ప్రస్తుతం ఆయన జ్వరంతో బాధపడుతున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. వైయస్ జగన్కు తగిన విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో, బుధవారం నిర్వహించాల్సిన అన్ని కార్యక్రమాలను ఆయన రద్దు చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని పార్టీ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో వెల్లడించారు.
పులివెందులలో రెండు రోజుల పాటు ప్రజలకు అందుబాటులో ఉండాలని నిర్ణయించిన వైయస్ జగన్, తొలి రోజు తన షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. మంగళవారం భాకరాపురం క్యాంప్ ఆఫీసులో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమం భారీ స్పందన పొందింది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ప్రజలు క్యాంప్ కార్యాలయానికి తరలివచ్చారు. తమ వ్యక్తిగత సమస్యలు, గ్రామాల్లో ఎదురవుతున్న ఇబ్బందులు, పాలన సంబంధిత అంశాలను వైయస్ జగన్కు నేరుగా వినిపించారు.
ప్రజల సమస్యలు ఒక్కొక్కటిగా నోట్ చేయించుకుంటూ, వీలైనంత త్వరగా పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే రెండో రోజైన బుధవారం జరగాల్సిన కార్యక్రమాలు ఆకస్మికంగా నిలిచిపోయాయి. షెడ్యూల్ ప్రకారం ఉదయం 10.30 గంటలకు పులివెందుల నుంచి ఇడుపులపాయకు వెళ్లాల్సి ఉండగా, అక్కడ ప్రేయర్ హాల్లో నిర్వహించే క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో వైయస్ జగన్ పాల్గొనాల్సి ఉంది. ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకు తిరిగి పులివెందుకు చేరుకుని భాకరాపురం క్యాంప్ ఆఫీసులో మరోసారి ప్రజాదర్బార్ నిర్వహించాల్సి ఉంది. అలాగే అక్కడే బస చేయాల్సిన ఏర్పాట్లు కూడా చేశారు.
కానీ జ్వరం తీవ్రత కారణంగా వైద్యులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో, ఈ అన్ని కార్యక్రమాలను వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో ముందుగానే ఏర్పాట్లు చేసుకున్న పార్టీ శ్రేణులు, అభిమానులు కొంత నిరుత్సాహానికి గురయ్యారు. అయితే వైయస్ జగన్ ఆరోగ్యం ముఖ్యమని, ఆయన త్వరగా కోలుకోవాలని కార్యకర్తలు ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారు.
పార్టీ వర్గాలు మాట్లాడుతూ.. వైయస్ జగన్ పరిస్థితి నిలకడగా ఉందని, ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారని తెలిపారు. ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిన వెంటనే పులివెందుల పర్యటనను మళ్లీ కొనసాగిస్తారని స్పష్టం చేశారు.
Also Read: ఏపీలో ‘సమగ్ర కుటుంబ సర్వే’.. ఈనెలాఖరు నుంచి మొదలు, ప్రశ్నల లిస్టు పెద్దదే?
వైయస్ జగన్ పర్యటన వాయిదా పడినప్పటికీ, తొలి రోజు ప్రజాదర్బార్ కార్యక్రమం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ప్రజలతో ఉన్న అనుబంధం, సమస్యలపై ఆయన చూపిన స్పందన మరోసారి చర్చకు వచ్చింది.