YS Jagan: నేడు తూర్పు గోదావరి జిల్లాలో వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటించారు.ఈ పర్యటనలో అతను మాట్లాడుతూ.. రాష్ట్రంలో పొగాకు రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారని, పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధర లేక ఆవేదనతో జంగారెడ్డి గూడెంలో పొగాకు రైతు వెంకటేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడని, కనీసం బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా వెళ్లకపోవడం అత్యంత బాధాకరమని విమర్శించారు.
దేవరపల్లి పర్యటనలో బాబు పాలనపై ధ్వజం
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలోని పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జగన్, అక్కడి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ 27 నెలల పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలూ నష్టపోయారని మండిపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి స్థానంలో చంద్రబాబు మార్కు విధ్వంసం మాత్రమే కనిపిస్తోందని ఆరోపించారు.
రైతులకు పంటలకు కనీస మద్దతు ధర దక్కడం లేదని, కూటమి ప్రభుత్వ విధానాల వల్ల వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతిన్నదని ధ్వజమెత్తారు.
వెన్నుపోటు పాలనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం
ప్రభుత్వ లోపాలను, ప్రజా సమస్యలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించి, అరెస్టులు చేస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మార్కు రాజకీయాలు ఎప్పుడూ వెన్నుపోటు పొడిచేలాగే ఉంటాయని, టీడీపీ అంటేనే వెన్నుపోటు పార్టీ అని విమర్శించారు. ఇటువంటి వెన్నుపోటు నైజం వల్ల నేడు సామాన్య ప్రజలు, రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన స్పష్టం చేశారు.
Also Read: ‘అబద్దాన్ని మీకన్నా ఎవరూ బాగా చెప్పలేరు’.. చంద్రబాబుపై షర్మిల సెటైర్లు!