YS Jagan Mohan Reddy: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ దాడులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి సామాజిక మాధ్యమాల వేదికగా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ కల్తీ అంశంపై గతంలో చేసిన ఆరోపణలను ఎన్.డి.డి.బి (NDDB), ఎన్.డి.ఆర్.ఐ (NDRI) వంటి కేంద్ర ప్రభుత్వ ల్యాబ్లు తప్పు అని నిర్ధారించాయని, ఆ విషయాన్ని ప్రశ్నిస్తే భరించలేక ప్రతిపక్ష నేతల ఇళ్లపై దాడులకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేశ్ ఇళ్లకు నిప్పు పెట్టడం అరాచకానికి మరియు ఆటవిక పాలనకు నిదర్శనమని జగన్ విమర్శించారు. ఇటువంటి దుశ్చర్యలతో ప్రజల్లో భయాన్ని కలిగించగలమని అనుకోవడం చంద్రబాబు భ్రమ అని, వాస్తవానికి ఈ నిప్పు ఆయన ప్రభుత్వానికే పెట్టుకున్నారని హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు “జంగిల్ రాజ్” (అడవి పాలన) కు ప్రతీకగా ఉన్నాయని, ఈ హింసాత్మక మంటల నుంచి పుట్టిన ప్రజా వేడి చంద్రబాబు ప్రభుత్వాన్ని దహించివేయడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.
ప్రజాస్వామ్యంలో హింసను ప్రేరేపించే ఏ శక్తీ నిలబడదని, రానున్న కాలంలో ప్రజాగ్రహ జ్వాలలు కూటమి ప్రభుత్వాన్ని బూడిద చేస్తాయని జగన్ ఘాటుగా వ్యాఖ్యానించారు. అరాచక పాలన అంతం కాక తప్పదని, చరిత్ర చెప్పే సత్యం ఇదేనంటూ చంద్రబాబుకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రతిపక్షం గొంతు నొక్కేందుకు దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్య విరుద్ధమని, ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యంలో, మీరు చేసిన తప్పుడు ఆరోపణలు తప్పు అని, ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ల్యాబులు NDDB, NDRI నిర్ధారణ చేసిన తర్వాత, మీరుచేసిన ఆ తప్పులకు మిమ్మల్ని ప్రశ్నిస్తే, జీర్ణించుకోలేక అంబటి రాంబాబు, జోగి రమేశ్ ఇళ్లకు మీరు నిప్పు పెట్టడం, ఆ దుశ్చర్యలతో భయాన్ని… pic.twitter.com/pA288I5ZIL
— YS Jagan Mohan Reddy (@ysjagan) February 1, 2026