ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తన సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీలో కల్తీ పాల ఘటనపై స్పందించిన ఆమె.. ఈ ఘటనలో ప్రభుత్వమే బాధ్యతపై వహించాలని ముందుగా డిమాండ్ చేశారు. అనంతరం గతప్రభుత్వం చేపట్టిన చర్యల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ పాల ఘటనలో వరలక్ష్మి డెయిరీ మీద ప్రధాన ఆరోపణలు వచ్చాయి. ఆ డెయిరీకి అనుమతులు లేవని, పదకొండు ఏండ్లుగా నడుస్తున్నదని అధికారులు విచారణలో తేల్చారు. అయితే, గత ప్రభుత్వం ఎందుకు ఇటువంటి అనుమతి లేని డెయిరీల మీద చర్యలు తీసుకోలేదని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.
రాజమండ్రిలో జరిగిన కల్తీ పాల ఘటనలో ఇప్పటివరకు సుమారు 11 మంది మృతి చెందినట్టు సమాచారం. మరికొందరికి కిడ్నీలు ఫెయిల్ అయినట్టు అధికారులు చెబుతున్నారు. మృతుల్లో చిన్నారులు సైతం ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వైఫల్యం కూటమి సర్కారుదే అని.. బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే బాధిత కుటుంబాలను పరామర్శించిన షర్మిల.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఇటువంటి కల్తీ ఘటనలు జరిగినా ముందుగా గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని ఆమె డిమాండ్ చేశారు.
కల్తీ పాల ఘటన వ్యవహారంలో ఆస్పత్రి పాలైన బాధితులు, మరణించిన వారి కుటుంబాలను ఎందుకు ఇంకా పరామర్శించలేదని ఆమె డిమాండ్ చేశారు. మాజీ సీఎంకు ఉండాల్సిన బాధ్యత ఇదేనా అని ఆమె ప్రశ్నించారు. రాజమండ్రిలోని కిమ్స్లో చికిత్స పొందుతున్న బాధితులను ఆమె పరామర్శించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ.. 11 ఏండ్లుగా వరలక్ష్మి అనే మహిళ డెయిరీ కూలింగ్ పాయింట్ నడిపిస్తున్నప్పుడు గత వైసీపీ ప్రభుత్వం ఎందుకు గుర్తించలేదని, ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆమె ప్రశ్నించారు.కూలెంట్ ఆయిల్ పాలల్లో కలవడం వలన ఆ పాలు తాగిన వారంతా అనారోగ్యం పాలైన విషయం తెలిసిందే. వైద్యుల పరీశీలనలో కిడ్నీలు పాడవ్వడానికి కెమికల్ కూలెంట్ ఆయిల్ కారణమని తేలింది.ఈ విషయంపైనా వైఎస్ షర్మిల అటు జగన్, ఇటు సీఎం చంద్రబాబు మీద ప్రశ్నల వర్షం కురిపించారు.
Kavitha : మరోసారి జైలుకు కవిత?
ఇదిలాఉండగా, వైఎస్ షర్మిల వ్యాఖ్యలపై కూటమి నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. 11 ఏండ్లుగా లైసెన్స్ లేకుండా నడిపిస్తున్న డెయిరీపై గత ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదో ముందు మీ సోదరుడు జగన్ను ప్రశ్నించాలని వారు నిలదీస్తున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు అవుతుందని,ఇలాంటి ఘటన ఒకటి జరుగుతుందని తమకు ముందు ఏమైనా కల వస్తుందా? అని ప్రశ్నిస్తున్నారు.అన్న మీద కోపం సీఎం చంద్రబాబు మీద ఎలా తీస్తారని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తన వంతు బాధ్యతను నెరవేరుస్తుందని, బాధితులకు ట్రీట్మెంట్, బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందించే విషయంలోనూ తీవ్రంగా కసరత్తు చేస్తున్నదని గుర్తుచేస్తున్నారు. గత ప్రభుత్వంలోనే కల్తీ మద్యం, కల్తీ నెయ్యి, కల్తీ పాల ఘటనలు జరిగాయని.. కానీ, అవన్నీ కూటమి ప్రభుత్వంలో వెలుగు చూస్తున్నాయని గుర్తుచేస్తున్నారు.