Global oil price hike: మిడిల్ ఈస్ట్ లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆయిల్ మార్కెట్లను వణికిస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇరాన్.. గల్ఫ్ దేశాలపై అమెరికా బేస్ లపై ఎదురు దాడులు చేస్తుండడంలో అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో భారీ అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా ఇరాన్ తన చమురు క్షేత్రాలు రిఫైనరీలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో హోర్ముజ్ సముద్ర మార్గాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20 శాతం వాటా కలిగిన ఈ మార్గం మూసుకుపోతే ఇంధన ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయమని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు బారెల్కు 100 డాలర్ల మార్కును తాకాయి. యుద్దం తీవ్రమైన సమయంలో ఇవి 119 డాలర్ల వరకు కూడా వెళ్లడం మార్కెట్ అస్థిరతకు నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలో జీ7 (G7) దేశాలు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. ప్రపంచ ఇంధన సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై అమెరికా బ్రిటన్ జర్మనీ ఫ్రాన్స్ జపాన్ వంటి దేశాలు చర్చిస్తున్నాయి. అవసరమైతే తమ వద్ద ఉన్న అత్యవసర చమురు నిల్వలను (Strategic Oil Reserves) మార్కెట్లోకి విడుదల చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి.
ఈ సంక్షోభం ఆసియా దేశాలపై ముఖ్యంగా భారత్ చైనాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. భారత్ తన చమురు అవసరాల్లో దాదాపు 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. మిడిల్ ఈస్ట్ నుంచి సరఫరా తగ్గితే దేశీయంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు అదుపు తప్పుతాయి. దీనిని అధిగమించేందుకు భారత్ తన దృష్టిని రష్యా చమురు వైపు మళ్లిస్తోంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్థాన్ శ్రీలంక వంటి పొరుగు దేశాలకు ఈ ఇంధన ధరల పెరుగుదల గొడ్డలిపెట్టులా మారనుంది. ఈజిప్ట్ వంటి దేశాలు ఇప్పటికే ఇంధన ధరలను 30 శాతం వరకు పెంచి ప్రజలపై భారం మోపాయి.
యుద్ధం గనుక సుదీర్ఘ కాలం కొనసాగితే ముడి చమురు ధరలు బారెల్కు 150 డాలర్లకు చేరే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం (Global Recession) తప్పదని హెచ్చరిస్తున్నారు. విద్యుత్ ఖర్చులు రవాణా ఛార్జీలు పెరగడం వల్ల సామాన్యుడి బతుకు భారమవుతుంది. ఒకవైపు రాజకీయ ఉద్రిక్తతలు మరోవైపు ఆర్థిక అస్థిరత ప్రపంచాన్ని క్లిష్ట పరిస్థితుల్లోకి నెడుతున్నాయి. అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకుని యుద్ధాన్ని నివారించకపోతే ఈ ఇంధన సెగలు ప్రతి ఇంటికి తాకడం ఖాయంగా కనిపిస్తోంది.
Read Also:అర్ధరాత్రి బాంబు పేల్చిన శ్రీలంక.. భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. పాక్ బాటలోనే లంక!