తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయాల్లో దూకుడు పెంచారు. మే నెలలో ఆమె కొత్త రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటించనున్నారు.ఈ విషయమై ఇప్పటికే స్పష్టంచేశారు. పార్టీ ఏర్పాటుకు సంబంధించి గ్రౌండ్ వర్క్ వేగంగా జరుగుతున్నట్టు సమాచారం. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వంపై ఆమె విమర్శలు చేస్తున్నారు.భూదాన్ భూముల వ్యవహారంలో బాధితుల పక్షాన పోరాడతానని ప్రకటించారు. నిన్న ఖమ్మం జిల్లాలో పర్యటించిన ఆమె ఇండ్లు కోల్పోయిన బాధితుల కోసం ధర్నా చేపట్టారు. ఈ క్రమంలోనే అరెస్టు అయ్యారు.సాయంకాలం విడుదలై మీడియాతో ముచ్చటించారు. ఎక్కడైతే పేదల ఇండ్లు కూల్చారో అక్కడే మరల వారికి పక్కా ఇండ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కవిత ప్రస్తుతం జాగృతి అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. జాగృతి పక్షానే ప్రజల కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. వాటిని నెరవేర్చడంలో ఫెయిల్ అయ్యిందని కవిత ప్రధానంగా ఆరోపిస్తున్నారు.మూసీ సుందరీకరణ పేరుతో రూ. వందల కోట్లు వృథా చేస్తున్నారని ఆమె ఫైర్ అయ్యారు. ఇదిలాఉండగా,కవిత రాజకీయాల్లో కుదురుకుంటున్నారని అనుకునేలోపే మరోసారి ఆమెకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు సాక్ష్యాధారాలు లేవని కల్వకుంట్ల కవిత, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సహా 23 మందికి క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన క్లీన్ చిట్ను సీబీఐ.. ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. అనంతరం కోర్టు 23 మందికి నోటీసులు జారీచేసింది. దీనికి కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు పంపించింది. దీనికి కవిత ఏం సమాధానం చెబుతారని ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ కవిత దాఖలు చేసే అఫిడవిట్లో సమాధానాలు, సీబీఐ సమర్పించే ఆధారాలు మేరకు ఢిల్లీ హైకోర్టు నిర్ణయం తీసుకోనుంది. ఒకవేళ సీబీఐ స్ట్రాంగ్ ఆధారాలు తయారుచేస్తే కవితకు షాక్ తప్పదని తెలుస్తున్నది. అదే నిజమైతే మరోసారి ఆమె అరెస్టు తప్పదని టాక్ వినిపిస్తున్నది. మరోసారి ఆమె తిహార్ జైలుకు వెళ్తారా? అని చర్చ జరుగుతున్నది.
BRS workshop: వర్క్ షాప్ కు కేసీఆర్ దూరం.. నేడు తొలిసారి పార్టీ సభ్యులకు ట్రైనింగ్
ఒకవేళ నిజంగానే కవిత జైలుకు వెళితే.. కొత్త పార్టీ భవితవ్యం ఏంటని ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతున్నది. ఆమెను నమ్మి వెంట నడుస్తున్న కార్యకర్తలు, లీడర్ల పరిస్థితి ఏంటని కూడా చర్చ జరుగుతున్నది.ఇటీవల కొందరు బీఆర్ఎస్ నేతలు తనతో టచ్లో ఉన్నారని ఇటీవల కవిత ప్రకటించిన విషయం తెలిసిందే. కవిత మరోసారి జైలుకు వెళితే.. వారంతా ఆమె వెంట వచ్చేందుకు సిద్దంగా ఉన్నారా? అంత ధైర్యం చేస్తారా? అని కూడా చర్చ జరుగుతున్నది. ఇదిలాఉండగా, గతంలో కవిత జైలుకు వెళ్లినప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులు పలుమార్లు ఢిల్లీకి వెళ్లి ఆమె బెయిల్ కోసం తీవ్రంగా శ్రమించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి, కల్వకుంట్ల ఫ్యామిలీకి దూరం అయ్యారు. ఈసారి కవిత అరెస్టు అయితే ఆమె కోసం ఎవరు ఫైట్ చేస్తారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.