Srikanth Reddy: వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం తప్పుడు ప్రచారాలు, దుష్ప్రచారాలపైనే ఆధారపడి రాజకీయం చేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తిరుమల లడ్డూ వ్యవహారం, వివేకా హత్య కేసు , గత ప్రభుత్వ అభివృద్ధిపై చంద్రబాబు అవాస్తవాలు మాట్లాడుతున్నారని బాధ్యతాయుతమైన సీఎం పదవిలో ఉండి ఆధారాలు లేకుండా మాట్లాడటం రాష్ట్ర దౌర్భాగ్యమని విమర్శించారు.
తిరుమల లడ్డూ వ్యవహారం
తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ఆరోపించడం ద్వారా హిందూవుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశారని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. వైసీపీని ప్రజలకు దూరం చేయాలనే దురుద్దేశంతోనే ఇలాంటి అపవిత్ర ప్రచారాలు చేస్తున్నారని, అందుకే తాము కోర్టును ఆశ్రయించామని తెలిపారు. ఏడు కొండలపై జీవో ఇచ్చింది వైఎస్సార్ అయితే, గతంలో రెండు కొండలే అంటూ మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు అని ఆయన గుర్తు చేశారు.
వివేకా హత్య కేసు
వివేకా హత్య కేసులో నిందితులను అప్రూవర్లుగా మార్చి రాజకీయ లబ్ధి పొందుతున్నారని, కేంద్రంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ఈ కేసులో నిజాలను ఎందుకు నిగ్గు తేల్చలేకపోతోందని ప్రశ్నించారు. చంద్రబాబు పాలన అంతా మోసపూరితమని.. ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజల దృష్టిని మళ్లించడానికి ‘డైవర్షన్ పాలిటిక్స్’ చేస్తున్నారని ఆరోపించారు. రైతు భరోసాను అటకెక్కించి, ‘అన్నదాత సుఖీభవ’ పేరుతో రైతులకు నామమాత్రపు సాయం చేస్తూ వంచిస్తున్నారని మండిపడ్డారు.
కూటమి ప్రభుత్వ వైఫల్యాలు
ప్రస్తుత కేబినెట్పై చంద్రబాబు పట్టు కోల్పోతున్నారని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేబినెట్ మీటింగులకు రాకుండా సినిమా ప్రమోషన్లకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. 30 శాతం మంత్రులు కూడా సమావేశాలకు హాజరు కాకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. ఇక వైసీపీ నుంచి వెళ్తున్న నేతలను ‘స్క్రాప్’ గా అభివర్ణించిన ఆయన.. అలాంటి వారు వెళ్లడం వల్ల పార్టీకి ఎలాంటి నష్టం లేదని, వైసీపీ మరింత పటిష్టంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు.
Also Read: గిరిజన పల్లెల్లో జనసేనాని.. చిన్నారులతో పవన్ ముచ్చట్లు.. చూస్తే ఫిదా కావాల్సిందే!