ఏపీ రాజకీయాల్లో అవకాశవాద పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీ అని కూటమి నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తాము చేస్తున్న అభివృద్ధిలో మంచి వారికి కనిపించడం లేదు కానీ, చెడును వెతికే పనులు చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. ఇప్పటివరకు కూటమి సర్కార్ చేపట్టిన ఏపనిలో అయినా కూసింత కూడా మంచి కనిపించడం లేదా? ప్రజలకు మంచి జరగలేదా? అని నిలదీస్తున్నారు. ప్రతీది రాజకీయం చేయడం హుందాతనం అనిపించుకోదని ఎద్దేవాచేశారు. ఎందుకంటే మొన్నటివరకు మెడికల్ కాలేజీల మీద కుటిల రాజకీయాలు చేసిన వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేతలు తాజాగా అమరావతి రాజధాని రైతులకు న్యాయం చేయాలని నినాదం ఎత్తుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నది.
అమరావతి రాజధాని ప్రాంతం మందడంలో నిన్న మంత్రి నారాయణ సమక్షంలో నిర్వహించిన గ్రామసభలో అనుకోకుండా ఓ రైతు గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. అయితే, సదరు రైతు తన గోడును చెప్పుకోవడానికి గ్రామసభకు విచ్చేశారు. అక్కడ తన సమస్యలు చెబుతున్న క్రమంలో ఆయనకు గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయాడు. అక్కడున్న వారంతా సీపీఆర్ చేసినా ఫలితం లేకుండా పోయింది. తాజాగా వైసీపీ నేతలు సదరు అన్నదాత మృతిని ప్రమాదంలా చూడకుండా రాజకీయం చేయడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. కూటమి నేతలు మాత్రం వైసీపీకి ప్రభుత్వాన్ని విమర్శించడానికి దారులు లేక అన్నదాత మరణాన్ని అడ్డం పెట్టుకుంటున్నదని ఫైర్ అవుతున్నారు.
ఏపీ ప్రజల సమస్యలపై మాట్లాడాలంటే ప్రతిపక్ష పార్టీకి చాలానే టాపిక్స్ ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఎంతో మంది నిరుద్యోగులు జాబ్స్ లేక ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారు. రాజధాని లేక ఎన్నో పరిశ్రమలు తరలివెళ్లాయి. ఇప్పుడెప్పుడే వాటిన్నింటిని కూటమి సర్కార్ సరిచేస్తున్నది. ఇటువంటి సమయంలో బాధత్య గల ప్రతిపక్షం అధికార పార్టీకి మద్దతుగా నిలవాలి. సలహాలు, సూచనలు చేయాలి. ప్రజాపక్షాన పోరాడాలి.కానీ రైతు మరణాన్ని అడ్డం పెట్టుకుని శవరాజకీయాలు చేయడం సరికాదని అధికార పార్టీ నేతలు హితవు పలుకుతున్నారు. అసలు మంత్రి నారాయణ సమక్షంలో మందడంలో గ్రామసభ నిర్వహించిందే రైతుల సమస్యలు తెలుసుకుని పరిష్కారం కనుగొనేందుకు.. అందుకు కూడా అడ్డుపడితే ఏం చేయాలంటూ వారు ప్రశ్నిస్తున్నారు.
రాజధాని అమరావతి అభివృద్ధికి 2014లో ఏర్పడిన టీడీపీ ప్రభుత్వ హయాంలోనే రైతులు భూములు ఇచ్చారు. స్వచ్ఛందంగా రైతులే ముందుకు వచ్చి ఇవ్వడం అందరికీ తెలిసిన విషయమే. అలా భూములు ఇచ్చిన వారికి ఉద్యోగం, రాజధాని సమీపంలో భూమి, డబ్బులు ఇస్తామని అప్పటి సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రస్తుతం అదే ప్రకటన కింద రైతులకు భూములు ఇచ్చారు. కానీ, మరణించిన రామారావుకు ఇచ్చిన భూమి వాగులో వచ్చిందని, సీడ్ యాక్సెస్ రోడ్డు సమీపంలో భూములు ఇవ్వాలని సదరు రైతు మంత్రిని డిమాండ్ చేశారు. ఆవేశంలో మాట్లాడటంతో ఆయనకు గుండెపోటు వచ్చింది. రైతుల నుంచి వినతులు తీసుకుని వారికి న్యాయం చేయడానికే ఆ గ్రామసభ నిర్వహించడం వెనుక ఉద్దేశం అని టీడీపీ పెద్దలు చెబుతున్నారు.రాజధాని కోసం భూములు ఇచ్చిన వారికి న్యాయం చేస్తామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. అలాంటప్పుడు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నట్టుగా ఇది ప్రభుత్వ హత్య ఎలా అవుతుందని కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలను డైవర్ట్ చేసే పాలిటిక్స్ మానుకోవాలని ఈ సందర్భంగా హితవు పలికారు.