B. Rajendranath: నంద్యాల జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఉమ్మడిగా రాయలసీమ నీటి హక్కుల కోసం గళమెత్తారు. ముఖ్యంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిల మధ్య ‘చీకటి ఒప్పందం’ కుదిరిందని వారు ఆరోపించారు. రేవంత్ రెడ్డి కోరగానే చంద్రబాబు ఈ ప్రాజెక్టును నిలిపివేశారని.. ఇది సీమ ప్రజలకు చేస్తున్న ద్రోహమని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు.
ఈ సందర్భంగా నాయకులు ప్రధానంగా శ్రీశైలం ప్రాజెక్టు నీటి వినియోగంపై ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం 800 అడుగుల స్థాయిలోనే నీటిని తరలిస్తుంటే.. రాయలసీమకు నీరు అందాలంటే 841 అడుగులు ఉండాల్సిన పరిస్థితి ఉందని.. అందుకే జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ పథకాన్ని తలపెట్టారని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఒక్క టీడీపీ నేత కూడా స్పందించకపోవడం వారి రహస్య ఒప్పందానికి నిదర్శనమని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. పోలవరం ఎత్తు తగ్గించడానికి, సీమ ప్రాజెక్టులను అటకెక్కిండానికి చంద్రబాబు అంగీకరించారని వారు ధ్వజమెత్తారు.
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ.. నందికొట్కూరు ప్రాంతం నుంచే రాయలసీమకు నీరు వెళ్లాలని.. ఇక్కడి ప్రాజెక్టులను అడ్డుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. శిల్పా చక్రపాణి రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి గతంలో వైఎస్సార్ చేసిన పోరాటాలను గుర్తు చేస్తూ.. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు వైఎస్ కుటుంబం మాత్రమే కట్టుబడి ఉందన్నారు. తిరుమల లడ్డూ వంటి వివాదాలను తెరపైకి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని నాయకులు ఆరోపించారు. రానున్న 2, 3 నెలల్లో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి.. ప్రజాసంఘాలను కలుపుకొని సీమ నీటి హక్కుల సాధన కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని వారు స్పష్టం చేశారు.
Also Read:ఓరుగల్లు మున్సిపాలిటీల్లో త్రిముఖ పోరు.. చేయి జారకుండా కాంగ్రెస్ జాగ్రత్తలు!