Municipal Elections 2026: ఉమ్మడి వరంగల్ జిల్లా పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మిశ్రమ ఫలితాలు చవిచూడాల్సి వచ్చింది. బీఆర్ఎస్, బీజేపీలు అనుకున్న దాని కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకుని కాంగ్రెస్ని డిఫెన్స్లోకి నెట్టాయి. ఆ క్రమంలో మున్సిపల్ ఎన్నికల సెగలు అన్ని పార్టీలను అయోమయానికి గురి చేస్తున్నాయట. ముఖ్యంగా ఈ ఎన్నికలను కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే సర్పంచ్ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలు ఈ సారి జరక్కుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందంట. అయితే టికెట్ దక్కని నేతలు ఏం చేయబోతున్నారోననే టెన్షన్ తో నాయకులు తలపట్టుకుంటున్నారట. రెబెల్స్ ను బుజ్జగించినా వినకపోవడంతో పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఆశించిన స్థాయిలో వచ్చేనా అని మదనపడుతున్నారట.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలు అధికార పార్టీకి కొంత ఝలక్ ఇచ్చాయి. బీఆర్ఎస్ పార్టీ బలం లేదనుకున్నచోట అత్యధిక స్థానాలు గెలుపొందింది. పార్టీ లేదనుకున్నచోట బిజెపి మద్దతుదారులు సైతం చెప్పుకోదగ్గ స్థానాల్లో విజయం సాధించారు. దీంతో అధికార పార్టీకి మున్సిపల్ ఎన్నికలు ఛాలెంజ్గా మారాయి. పంచాయతీ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలు మరోసారి రిపీట్ కాకుండా చూసుకోవాలని అధిష్టానం జిల్లా నేతలకు సున్నితంగానే హెచ్చరికలు జారీ చేసిందంట. చురకలు వేసింది. రెబెల్ అభ్యర్థులను బుజ్జగించి, టికెట్ దక్కని అసంతృప్తులను చేరదీస్తేనే అనుకూల ఫలితాలు వస్తాయని సూచించిందంట.
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 మున్సిపాలిటీలలో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా 260 వార్డు స్థానాలకు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బిజెపి పార్టీల నుండి అభ్యర్థులు బరిలో నిలిచారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో రెబెల్ అభ్యర్థుల కారణంగా అత్యధికంగా నష్టపోయింది అధికార కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ నేతల ఆధిపత్యపోరుతో చాలాచోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు.
అయితే పార్టీ గుర్తు లేకుండా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో గెలుపును పార్టీ గెలుపుగా భావిస్తూ మునిసిపల్ ఎన్నికల్లో కారు పార్టీ హవా నడుస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు ధీమా పోతున్నాయి. ఆ ధీమా కారణంగానే మున్సిపల్ ఎన్నికల బరిలో అధికార కాంగ్రెస్ కంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ లోనే రెబెల్ అభ్యర్థుల బెడద పెరిగిందట. జనగామ, తొర్రూరు, వర్ధన్నపేట, భూపాలపల్లి, మహబూబాబాద్ మున్సిపాలిటీలలో బీఆర్ఎస్లో వర్గాలు ఏర్పడి పోరుకి సిద్దమయ్యాయి. దాంతో రెబల్ అభ్యర్థులను బుజ్జగించేందుకు మాజీ ఎమ్మెల్యేలు నానా తంటాలు పడుతున్నారట.
అధికార, ప్రధాన ప్రతిపక్షాల మధ్య పోరు ఒకలా ఉంటే… కాషాయ పార్టీలోనూ గ్రామపంచాయతీ ఎన్నికలు జోష్ పెంచాయి. మున్సిపాలిటీలను కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేశామని, బిజెపిని గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామని చెబుతూ ఎన్నికల బరిలో తలపడుతున్నారు బిజెపి అభ్యర్థులు. వరంగల్ జిల్లాలో చార్జి షీట్ పేరుతో గత 10 ఏళ్లలో బిఆర్ఎస్ హామీ ఇచ్చి చేయలేని పనులు, గత రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి చేయలేని పనులు… ఓటర్లకు వివరిస్తూ తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారట. పంచాయతీ ఎన్నికలలో వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి జిల్లాలలో బీజేపీకి అంతోఇంతో ఓటు బ్యాంకుంది. అందుకే ఈ మూడు జిల్లాలపై బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ చేసిందట. ఓటర్ల పరంగా చూసినప్పుడు మున్సిపాలిటీలు నియోజకవర్గాలకు కీలకం కావడంతో ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని కాషాయ పార్టీ చూస్తోందట.
వర్ధన్నపేట, భూపాలపల్లి, జనగామ, పరకాల మున్సిపాలిటీలలో అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ పార్టీలకు రెబెల్స్, అసంతృప్తి నేతల బెడద ఎక్కువగా ఉంది. అందుకే ఈ నాలుగు మున్సిపాలిటీలలో తమ కలిసి వస్తుందని బీజేపీ లెక్కలు వేసుకుంటోందంట. మరోవైపు అధికార కాంగ్రెస్లో అభ్యర్థుల ఎంపిక వివాదాస్పదమైంది. వలస వచ్చిన నాయకులకు టికెట్లు ఖరారు చేయడం, పార్టీకి నమ్ముకున్న వారికి మొండి చేయి చూపడంతో పంచాయతీ ఎన్నికల షాక్ మరోసారి తప్పదనే గుసగుసలు హస్తం పార్టీ శ్రేణుల్లో వినిపిస్తున్నాయి.
బీఆర్ఎస్ సైతం ఈసారి అర్థ బలం ఉన్న నేతలకే టికెట్లు కన్ఫామ్ చేయడంతో, ఉద్యమకారులు ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నేతలు… యమ గుర్రుగా ఉన్నారట. అసంతృప్తులను బుజ్జగించలేక, రెబెల్స్ను నిలువరించలేక గులాబీపార్టీ ఇన్చార్జులు సతమతమవుతున్నారట. నాయకులను బుజ్జగించే బదులు…ఫలితాలు తర్వాత గెలిచిన అభ్యర్థులకు కండువా కప్పితే సరిపోతుంది అంటూ మరికొంతమంది నాయకులు భావిస్తున్నారట. ఏది ఏమైనా మున్సిపల్ ఎన్నికల వేడి నాయకులను ముప్పతిప్పలు పెడుతోందట. ఇంతకీ ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందో చూడాలి మరి.
Story by: Apparao, Big Tv