రాజకీయాలు ఎవరు చేసినా హుందాగా ఉండాలి. విమర్శలు అనేవి వ్యక్తిగతంగా ఉండరాదు. పార్టీ పరంగా మాత్రమే ఉండాలి. అందులోనూ ప్రభుత్వ తప్పులను మాత్రమే ఎత్తిచూపాలి. అంతేకానీ, పర్సనల్గా ఉండరాదు. కానీ కొందరు నేతల తీరు ప్రస్తుత రాజకీయాలకు మాయని మచ్చగా మిగులుతోంది.గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ఈ సంస్కృతికి నాంది పలికిందని అప్పట్లోనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సాక్ష్యాత్తు అసెంబ్లీ వేదికగా అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన భార్యను రాజకీయాల్లోకి లాగారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. అప్పటి విజువల్స్ నేటికి అతి జుకుప్సకరంగా అనిపిస్తాయని, వాటిని గుర్తుచేసుకోకపోవడమే మంచిదని కొందరు అంటున్నారు.
గతంలో వైసీపీ కీలక నేతలు అసెంబ్లీని ఒక మహాభారత పర్వంలా క్రియేట్ చేశారని విమర్శలొచ్చాయి. అయితే, ప్రస్తుతం కాలం మారింది. అధికారానికి దూరమైన వైసీపీ మాత్రం తన తీరులో ఏమాత్రం మార్పు కనిపించడం లేదని తెలుస్తున్నది. ప్రతిపక్షంలో ఉన్నామని కూటమి సర్కార్ వచ్చాక కొందరు నేతలకు అర్థం అవ్వడంతో వారంతా సైలెంట్ అయ్యారు. కొందరు మాత్రం నేటికి అదే ధోరణితో ముందుకు వెళ్లడం రాష్ట్ర ప్రజలకు సైతం విసుగు తెప్పిస్తున్నట్టు టాక్. పద్ధతి మార్చుకోవాలని ఎంత చెప్పినా వారిలో ఎటువంటి మార్పు కనిపించడం లేదని అంటున్నారు కొందరు. ఇక వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తమ పార్టీ నేతలను కంట్రోల్లో పెట్టుకోవడం లేదనే విమర్శలు సైతం భారీగా నే వినిపిస్తున్నాయి.
ఏపీలో కూటమి సర్కార్ రావడం రావడంతోనే ముందుగా నిఘా వ్యవస్థను పటిష్టం చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న వ్యతిరేక పోస్టులపై కఠినంగా వ్యవహరిస్తున్నది. ముఖ్యంగా మహిళలపై దుర్భాష, వేధింపులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇక వైసీపీ శ్రేణులు వ్యక్తిత్వ హనన పోస్టులు పెడితే వారికి తగిన బుద్ధి చెప్పి కటకటలా వెనక్కి పంపుతున్నారు.అయినప్పటికీ కొందరిలో మార్పు రావడం లేదు. ఆ మధ్య వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్ చేసే వ్యక్తిని సైతం పోలీసులు అరెస్టు చేశారు. అయినప్పటికీ పార్టీ నేతలు, సోషల్ వారియర్స్ తీరులో ఏ మార్పు లేదు. మంత్రులు, మహిళలు అని కూడా చూడకుండా బూతులు మాట్లాడటం, దుర్భాషలు చేయడం వంటి పోస్టులను వైసీపీ నేతలు వైరల్ చేస్తున్నారు.
తాజాగా మరోసారి సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. చంద్రబాబు, ఆయన ఫ్యామిలీ మీద విష్ణు అనే వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు, వక్తిత్వ హననం చేస్తూ పోస్టులు పెడుతున్నారని, అతని పోస్టులు చూసి తన మనోభావాలు దెబ్బతిన్నాయని టీడీపీ మహిళా నాయకురాలు లీలావతి చిత్తూరు టూటౌన్ పీఎస్లో కేసు పెట్టారు. ఆ వ్యక్తి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. వైసీపీ నేతల ఆగడాలు శృతి మించాయని, ఏకంగా సీఎం కుటుంబంపైనే ఇలాంటి పోస్టులు పెడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగితే ఊరుకునేది లేదని.. వారిని కఠిన శిక్షలు పడేలా పోలీసులు చూడాలని ఆమె కోరారు. కాగా, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా వైసీపీ నేతల బుర్రలో చెడు తప్ప మంచి కనిపించదని.. వారికి కఠిన శిక్షలు పడితేనే గానీ మార్పు రాదని పలువురు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు.