Ather Rizta Sales Boom: దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు భారీగా ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఏథర్ ఎనర్జీకి చెందిన రిజ్టా స్కూటర్ అమ్మకాల్లో రాకెట్ లా దూసుకెళ్తోంది. కుటుంబ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్.. విడుదలైన కొద్దికాలంలోనే భారీ స్థాయిలో అమ్మకాలు సాధిస్తోంది. ఏప్రిల్ 2024లో మార్కెట్లోకి వచ్చిన ఏథర్ రిజ్టా, రోజువారీ ప్రయాణాలకు అనువైన డిజైన్, సౌకర్యవంతమైన సీటింగ్, నిల్వ స్థలం, మెరుగైన రేంజ్ వినియోగదారులను ఆకట్టుకున్నాయి. ఏప్రిల్ 2026 చివరి నాటికి దేశ వ్యాప్తంగా రిజ్టా స్కూటర్ 3 లక్షల అమ్మకాల మార్క్ ను దాటింది. మొత్తం 3,09,501 యూనిట్లు వినియోగదారులకు డెలివరీ చేసినట్లు కంపెనీ తెలిపింది.
రిజ్టా స్కూటర్ కు సంబంధించిన డెలివరీలు జూలై 2024లో ప్రారంభమయ్యాయి. మార్కెట్లోకి వచ్చిన కేవలం 10 నెలల్లోనే లక్ష యూనిట్ల అమ్మకాలను సాధించింది. ఆ తర్వాత కూడా డిమాండ్ తగ్గకుండా కొనసాగింది. అక్టోబర్ 2025 నాటికి రెండు లక్షల అమ్మకాల మైలురాయిని చేరుకున్న ఈ స్కూటర్, తదుపరి మరో లక్ష యూనిట్లను కేవలం ఆరు నెలల్లోనే విక్రయించింది. ఇది మార్కెట్లో ఈ మోడల్కు ఉన్న క్రేజ్ను స్పష్టంగా చూపిస్తోంది.
ప్రస్తుతం రిజ్టా, ఏథర్ కంపెనీకి అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్గా నిలిచింది. కంపెనీ మొత్తం విక్రయాల్లో మూడొంతులకుపైగా వాటాను ఈ ఒక్క మోడల్నే దక్కించుకుంది. FY2026 ఆర్థిక సంవత్సరంలో ఏథర్ మొత్తం అమ్మకాలలో రిజ్టా వాటా 76 శాతంగా నమోదైంది. ఏథర్ ఎనర్జీ, భారత ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్లో TVS మోటార్, బజాజ్ ఆటో తర్వాత మూడవ అతిపెద్ద తయారీదారుగా ఎదిగింది.
రిజ్టా సక్సెస్ మరో కారణం ధర. బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్(BaaS) విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా వినియోగదారులకు తక్కువ ప్రారంభ ధరలో స్కూటర్ అందుబాటులోకి వచ్చింది. ఈ పథకం కింద రిజ్టా ఎస్ వేరియంట్ను రూ. 76 వేల ఎక్స్ షోరూమ్ ధరతో కొనుగోలు చేసే అవకాశం కల్పించారు. దీంతో మొదటిసారి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే మధ్యతరగతి కుటుంబాలు కూడా ఆసక్తి చూపుతున్నాయి.
ఏథర్ ఎనర్జీ తీసుకొచ్చిన రిజ్టా కుటుంబ అవసరాలకు అనుకూలంగా ఉంది. 2.9 kWh, 3.7 kWh బ్యాటరీ ఆప్షన్స్ తో అందుబాటులో ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 159 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. పెద్ద సీటు, 34 లీటర్ల స్టోరేజ్, 80 కిలో మీటర్ల టాప్ స్పీడ్తో రోజువారీ ప్రయాణాలకు బాగా ఉపయోగపడుతుంది. స్కిడ్ కంట్రోల్, ఫాల్ డిటెక్షన్, టచ్ స్క్రీన్ డిస్ ప్లే, గూగుల్ మ్యాప్స్ లాంటి ఆధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. రిజ్టా S, రిజ్టా Z వేరియంట్లలో ఈ స్కూటర్ అందుబాటులో ఉండగా, ధర సుమారు రూ.1.10 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
అటు ఏథర్ కంపెనీ భవిష్యత్ వ్యూహాల్లో భాగంగా కొత్త EL ప్లాట్ ఫారమ్ పై కూడా పని చేస్తోంది. భవిష్యత్తులో మరిన్ని మాస్ మార్కెట్ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఈ ప్లాట్ఫామ్ ఆధారంగా తీసుకురావాలని ఏథర్ లక్ష్యంగా పెట్టుకుంది.
Read Also: ఏథర్ EL ప్లాట్ ఫారమ్ రెడీ.. ఇక చవక ధరలో కొత్త ఈ-స్కూటర్లు!