Heavy Fines for EV Riders Breaking Signals: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజు రోజుకు మరింత పెరుగుతోంది. ముఖ్యంగా ఈవీ స్కూటర్లు, బైకులు సిటీల నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే, ఈవీలకు సంబంధించి ప్రజల్లో కొన్ని అపోహలు ఉన్నాయి. చాలా మంది ఈవీ రైడర్లు ఇవి పొల్యూషన్ ఫ్రీ వాహనాలు కాబట్టి పోలీసులు పెద్దగా పట్టించుకోరు. లైసెన్స్ అవసరం లేదంటే రూల్స్ కూడా ఉండవని భావిస్తున్నారు. అయితే, ఈ అపోహలు నిజం కాదు. ట్రాఫిక్ రూల్స్ అనేవి రోడ్డు మీద ప్రయాణించే ప్రతి ఒక్కరికీ ఒకేలా ఉంటాయి.
భారత చట్టాల ప్రకారం ఈవీలను రెండు రకాలుగా విభజించారు. మొదటివి గంటకు 25 కిలోమీటర్ల లోపు వేగంతో వెళ్లే వాహనాలు. అంటే, 250 వాట్ల కంటే తక్కువ పవర్ ఉన్న వాహనాలను తక్కువ వేగం కలిగిన ఈవీలుగా భావిస్తారు. వీటికి రిజిస్ట్రేషన్, నంబర్ ప్లేట్, డ్రైవింగ్ లైసెన్స్ అవసరం ఉండదు. కానీ, ట్రాఫిక్ రూల్స్ వర్తించవు అనుకోవడం తప్పు. రాంగ్ సైడ్ లో వెళ్లడం, సిగ్నల్ దాటడం, మొబైల్ చూస్తూ డ్రైవ్ చేయడం లాంటి తప్పులు చేస్తే, చట్టపరమైన చర్యలు తప్పవు.ఇక 25 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వెళ్లే ఈవీలు సాధారణ మోటార్ వాహనాలుగా పరిగణిస్తారు. వీటికి గ్రీన్ నంబర్ ప్లేట్, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. ఈ వాహనాలపై పోలీసులు సాధారణ వాహనాల మాదిరిగానే పరిగణిస్తారు.
ఇప్పటి వరకు చాలామంది ఈవీలు సౌండ్ చేయవు కాబట్టి పోలీసులు పట్టించుకోరు అనుకుంటారు. కానీ, ప్రస్తుతం ట్రాఫిక్ రూల్స్ అమలు విధానం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు నగరాల్లో AI ఆధారిత సీసీ కెమెరాలు, ఆటోమేటిక్ చలాన్ వ్యవస్థలు అందుబాటులోకి వచ్చాయి. నంబర్ ప్లేట్ స్పష్టంగా కనిపించకపోయినా, పదేపదే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిని గుర్తించే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. అదే సమయంలో కొత్తగా అమల్లోకి వచ్చిన 5 చలాన్ రూల్ సీరియస్ గా అమలు అవుతోంది. ఒక ఏడాదిలో ఐదు, అంతకంటే ఎక్కువ చలాన్లు నమోదైతే, డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ అయ్యే అవకాశం ఉంది. భవిష్యత్తులో లైసెన్స్ పొందడంపై అంత ఈజీ కాదు.
ఈవీ రైడర్లకు కూడా సాధారణ వాహనాల మాదిరిగానే జరిమానాలు విధిస్తున్నారు. డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడితే రూ.5,000 వరకు జరిమానా వేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మూడు నెలల పాటు లైసెన్స్ సస్పెండ్ చేస్తున్నారు. సిగ్నల్ జంప్ చేస్తే రూ.1,000 నుంచి రూ.5,000 వరకు ఫైన్ పడుతుంది. రాంగ్ రూట్లో వెళితే భారీ జరిమానాతో పాటు వాహనాన్ని సీజ్ చేసే అవకాశమూ ఉంది. 18 ఏళ్లలోపు పిల్లలు ఈవీలు నడిపితే పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంటుంది. రూ.25,000 వరకు జరిమానా విధించడమే కాకుండా, వాహనం ఇచ్చిన తల్లిదండ్రులు లేదా సంరక్షకులపై కూడా కేసులు నమోదు అవుతున్నాయి.
ఈవీల వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని ట్రాఫిక్ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈవీలు శబ్దం చేయకపోవడం వల్ల రోడ్డు మీద వెళ్లేవారు వాటిని గుర్తించలేకపోతున్నారు. అలాంటి సమయంలో రాంగ్ సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ పెద్ద ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. అందుకే హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ లాంటి నగరాల్లో ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. పర్యావరణానికి మేలు చేసే ఈవీలు కొనుగోలు చేయడం మంచిదే. కానీ, ఈవీ కాబట్టి ట్రాఫిక్ రూల్స్ వర్తించవు అనుకోవడం చాలా ప్రమాదకరం. రోడ్ సేఫ్టీ అందరి బాధ్యత అనే విషయం ప్రతి రైడర్ గుర్తించాలి.
Read Also: టాటా SUVలపై బంపర్ ఆఫర్లు.. హారియర్, సఫారీ మరీ ఇంత చౌకా?