Ethanol Blended Petrol Impact: భారత ప్రభుత్వం ఇంధన దిగుమతుల భారాన్ని తగ్గించుకోవడానికి, పర్యావరణ హితం కోసం పెట్రోల్లో ఇథనాల్ కలిపే ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న E10 (10% ఇథనాల్) నుండి E20 (20%) భవిష్యత్తులో E30 స్థాయికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఈ మార్పు పర్యావరణానికి మేలు చేసినప్పటికీ, వాహన వినియోగదారులకు, ముఖ్యంగా పాత వాహనాల యజమానులకు కొన్ని క్లిష్టమైన సమస్యలను తెచ్చిపెడుతోంది.
Read also-Washing Mistakes: వాషింగ్ మెషీన్ వాడేటప్పుడు ఈ తప్పలు అస్సలు చేయకండి..
ఇథనాల్ ఒక రకమైన ఆల్కహాల్. ఇది స్వభావరీత్యా ద్రావణి (Solvent) వలె పనిచేస్తుంది. పాత వాహనాలలోని ఇంధన వ్యవస్థలు కేవలం స్వచ్ఛమైన పెట్రోల్కు అనుగుణంగా రూపొందించబడ్డాయి. పెట్రోల్లో ఇథనాల్ శాతం పెరిగినప్పుడు ఇంధన పైపులు, గ్యాస్కెట్లు, రబ్బరు సీల్స్ ఇథనాల్ ప్రభావానికి గురై త్వరగా మెత్తబడిపోతాయి లేదా పగుళ్లు ఇస్తాయి. దీనివల్ల ఇంధనం లీక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇథనాల్ గాలిలోని తేమను పీల్చుకుంటుంది. దీనివల్ల ఇంధన ట్యాంక్, ఇంజిన్ లోపలి లోహపు భాగాలు తుప్పు పట్టి, ఇంజిన్ పనితీరు మందగిస్తుంది.
ఇది వాహనదారులకు ఎదురయ్యే అతిపెద్ద సాంకేతిక సమస్య. ఇథనాల్కు నీటిని ఆకర్షించే గుణం ఉంటుంది. వాహనాన్ని కొన్ని రోజుల పాటు వాడకుండా ఉంచితే, ట్యాంక్లోని ఇంధనం రెండు పొరలుగా విడిపోతుంది. నీటితో కలిసిన ఇథనాల్ ట్యాంక్ అడుగు భాగానికి చేరుతుంది. దీనివల్ల ఇంజిన్ స్టార్ట్ కావడంలో ఇబ్బందులు కలగడమే కాకుండా, ఇంజిన్ శాశ్వతంగా దెబ్బతినే అవకాశం ఉంది.
సాధారణ పెట్రోల్తో పోలిస్తే ఇథనాల్లో తక్కువ శక్తి ఉంటుంది. ఇథనాల్ శాతం పెరిగేకొద్దీ ఇంజిన్ దహన ప్రక్రియలో మార్పులు వస్తాయి. దీనివల్ల వాహనం ఇచ్చే మైలేజీ 3% నుండి 6% వరకు తగ్గే అవకాశం ఉంది. అంటే, వినియోగదారుడు తక్కువ మైలేజీ పొందుతూ ఎక్కువ ఇంధనం వాడాల్సి వస్తుంది. దీంతో సామాన్యులపై భారం పెరగుతుంది. రవాణా ఖర్చు కూడా దాదాపు 2% నుంచి 3% పెరిగే అవకాశం ఉంది. రవాణా ఖర్చులు పెరిగితే ఈ భారం అందిరిపై పడనుంది. ప్రభుత్వం దీనిపై వేరే విధంగా ఏమైనా స్పందిస్తుదో లేదో చూడాలి.
Read also-Mohanlal Rights: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన మాలీవుడ్ సూపర్ స్టార్.. కారణం ఇదే..
ఇథనాల్ మిశ్రమ ఇంధనం వల్ల స్పార్క్ ప్లగ్స్, ఫ్యూయల్ ఫిల్టర్లు త్వరగా పాడవుతాయి. దీనివల్ల వాహన నిర్వహణ ఖర్చు పెరుగుతుంది. ఇథనాల్ను చక్కెర, ధాన్యాల నుండి తయారు చేస్తారు. ఇంధనం కోసం వీటిని భారీగా వాడటం వల్ల భవిష్యత్తులో ఆహార పదార్థాల ధరలు పెరిగే ప్రమాదం ఉంది. ఇంధన స్వయంసమృద్ధి దిశగా ఇథనాల్ బ్లెండింగ్ ఒక మంచి అడుగు. అయితే, పాత వాహనాలను వాడుతున్న సామాన్య ప్రజలకు ఇది భారంగా మారకుండా ఉండాలంటే, ప్రభుత్వం పాత వాహనాల ఇంజిన్లలో మార్పులు చేసుకునేందుకు రాయితీలు ఇవ్వడం లేదా ప్రత్యేక కిట్లను అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలి. లేదంటే సామాన్యుల జేబులకు చిల్లులు పడే అవకాశం ఉంటుంది.