Bomb Threat: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు భయాందోళనలకు గురిచేశాయి. ముఖ్యంగా అసెంబ్లీలో ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్న కీలక సమయంలో, ఢిల్లీ మెట్రో స్టేషన్ను లక్ష్యంగా చేసుకుని పేలుళ్లు జరుపుతామంటూ బెదిరింపులు రావడం సంచలనంగా మారింది. అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్తాకు అందిన అనామక ఈమెయిల్స్లో ఈ హెచ్చరికలు ఉండటంతో అధికార యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
ఈ హెచ్చరికలను అత్యంత తీవ్రంగా పరిగణించిన స్పీకర్ విజేందర్ గుప్తా, వెంటనే ఉన్నతాధికారులను, భద్రతా సంస్థలను అప్రమత్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు, బాంబు డిస్పోజల్ స్క్వాడ్ (BDS), ప్రత్యేక దర్యాప్తు బృందాలు మెట్రో స్టేషన్ పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. బడ్జెట్ ప్రసంగం జరగాల్సిన సమయంలోనే ఇలాంటి మెయిల్స్ రావడం వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు.
భద్రతా చర్యల్లో భాగంగా డాగ్ స్క్వాడ్ సాయంతో మెట్రో ప్రాంగణాల్లోని ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అనుమానాస్పద వస్తువుల కోసం గాలింపు ముమ్మరం చేయడంతో పాటు, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు, అసెంబ్లీ ప్రాంగణంలో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు.
Also Read: సముద్ర అలలపై ఇంధన కెరటాలు.. భారత్కు చేరుతున్న రెండు భారీ ఎల్పీజీ నౌకలు
ఈ బెదిరింపు మెయిల్స్ ఎక్కడి నుండి వచ్చాయి? దీని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? అనే అంశంపై సైబర్ క్రైమ్ పోలీసులు దృష్టి సారించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇవి తప్పుడు బెదిరింపులు (Hoax calls) కావచ్చని అనుమానిస్తున్నప్పటికీ, బడ్జెట్ సమావేశాల దృష్ట్యా ఎక్కడా అశ్రద్ధ వహించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలు ఆందోళన చెందవద్దని, భద్రతా దళాలు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని అధికారులు వెల్లడించారు.
ఢిల్లీ అసెంబ్లీకి బాంబు బెదిరింపు
బాంబ్ స్క్వాడ్, డాగ్ డ్క్వాగ్ తో విస్తృత తనిఖీలు
Bomb Threat to Delhi Assembly
Extensive searches conducted by Bomb Squad and Dog Squad pic.twitter.com/VR4jvRA0Sg
— BIG TV Breaking News (@bigtvtelugu) March 24, 2026