Flex-Fuel Cars and Bikes: దేశంలో ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల యుగం ప్రారంభమవుతోంది. దేశంలోని ప్రముఖ వాహన తయారీ సంస్థలు హీరో మోటోకార్ప్, మారుతీ సుజుకి ఈ విభాగంలో తమ తొలి మాస్ మార్కెట్ ఉత్పత్తులను తీసుకొచ్చాయి. హీరో తన స్ప్లెండర్ ప్లస్, హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ లను విడుదల చేయగా, మారుతీ సుజుకి వాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారును పరిచయం చేసింది.
ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనం అంటే ఒకే ట్యాంక్ లో పెట్రోల్, ఇథనాల్, రెండింటి మిశ్రమంతో నడిచే వాహనం. ఇందులో ప్రత్యేక సెన్సార్లు ఉండటంతో ట్యాంక్ లో ఉన్న ఇంధన మిశ్రమాన్ని గుర్తించి, ఇంజిన్ పనితీరును ఆటోమేటిక్ గా సర్దుబాటు చేస్తాయి. అందువల్ల డ్రైవర్ కు ప్రత్యేకంగా ఏ మార్పులు చేయాల్సిన అవసరం ఉండదు. డిజైన్ పరంగా చూస్తే, ఈ వాహనాలు సాధారణ మోడళ్లతో పెద్దగా భిన్నంగా కనిపించవు. వాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్ లో ఫ్లెక్స్ ఫ్యూయల్ బ్యాడ్జ్ లు మాత్రమే కొత్తగా కనిపిస్తాయి. అలాగే హీరో బైక్లలో ప్రత్యేక గ్రాఫిక్స్, కొత్త కలర్ స్కీమ్ ను అందించారు.
అయితే, ఈ వాహనాల ధరలు సాధారణ పెట్రోల్ మోడళ్లతో పోలిస్తే కొంత ఎక్కువగా ఉంటాయి. ఇథనాల్ ప్రభావాన్ని తట్టుకునే ప్రత్యేక భాగాలను ఉపయోగించాల్సి రావడంతో తయారీ ఖర్చు పెరుగుతుంది. ప్రస్తుతం స్ప్లెండర్ ప్లస్, హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్లు వాటి సాధారణ మోడళ్ల కంటే సుమారు 6 శాతం అధిక ధరతో మార్కెట్లోకి వచ్చాయి.
ఇంధన ఖర్చు విషయంలో కాస్త మనీ సేవ్ చేసుకోవచ్చు. E85, E100 లాంటి ఇథనాల్ ఇంధనాలు పెట్రోల్ కంటే తక్కువ ధరలో లభిస్తాయి. అయితే, ఇథనాల్ లో శక్తి సాంద్రత తక్కువగా ఉండటం వల్ల మైలేజ్ కూడా కొంత తగ్గవచ్చు. అందువల్ల వాస్తవంగా ఎంత ఆదా అవుతుందో వినియోగదారుల డ్రైవింగ్ విధానంపై ఆధారపడి ఉంటుంది.
సర్వీసింగ్ విషయానికి వస్తే, సాధారణ వాహనాల కంటే కొద్దిగా ఎక్కువ జాగ్రత్త అవసరం కావచ్చు. ఇథనాల్ గాలిలోని తేమను ఆకర్షించే స్వభావం కలిగి ఉంటుంది. దీంతో కొన్ని భాగాలపై ప్రభావం పడే అవకాశం ఉన్నప్పటికీ, తయారీదారులు ఇప్పటికే అవసరమైన మార్పులు చేశారు. క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయిస్తే పెద్ద సమస్యలు ఎదురయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
రీసేల్ వ్యాల్యూ గురించి ఇప్పుడే స్పష్టంగా చెప్పడం కష్టం. ఎందుకంటే ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు భారత మార్కెట్లో కొత్తగా ప్రవేశిస్తున్నాయి. భవిష్యత్తులో ఇథనాల్ ఇంధనానికి ఎంత ఆదరణ లభిస్తుందో, ఈ వాహనాల పనితీరు ఎలా ఉంటుందో బట్టి వాటి రీసేల్ విలువ ఉంటుంది. ప్రస్తుతం ఇంధన లభ్యత కూడా ప్రస్తుతం పరిమితంగానే ఉంది. తాజాగా ఢిల్లీలో ఇథనాల్ స్టేషన్లు ప్రారంభం అయ్యాయి. ముంబై, పూణే, నాగ్ పూర్ లాంటి నగరాల్లో మాత్రమే E85 పంపులు ఏర్పాటు చేస్తున్నారు. అయితే, ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలతో లాభం ఏమిటంటే, ఇథనాల్ దొరకకపోతే సాధారణ పెట్రోల్తో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నడపవచ్చు.
Read Also: ఢిల్లీలో E85 ఫ్యూయల్ అమ్మకాలు ప్రారంభం.. లీటర్ ధర జస్ట్ రూ.82!