Hero MotoCorp Flex-Fuel Versions: ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలకు సంబంధించి హీరో మోటోకార్ప్ అదిరిపోయే అనౌన్స్ మెట్ చేసింది. రాబోయే ఒకటి నుంచి రెండు సంవత్సరాల్లో తమ కంపెనీకి చెందిన అన్ని టూ వీలర్ వాహనాలకు ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్లను తీసుకురానున్నట్లు తెలిపింది. పెట్రోల్ కు ప్రత్యామ్నాయంగా ఇథనాల్ వినియోగాన్ని ప్రోత్సహించే కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలకు అనుగుణంగా హీరో ఈ చర్యలు చేపడుతోంది.
ఇటీవల హీరో తన పాపులర్ మోడల్స్ అయిన అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లైన స్ప్లెండర్ ప్లస్, హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ల E85-కంప్లైంట్ వెర్షన్లను పరిచయం చేసింది. దీంతో ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీని అందిస్తున్న కంపెనీగా హీరో గుర్తింపు తెచ్చుకుంది. E85 అంటే 85 శాతం ఇథనాల్, 15 శాతం పెట్రోల్ మిశ్రమంతో పనిచేసే ఇంధనం. ముడి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, దేశీయంగా ఉత్పత్తి అయ్యే ఇథనాల్ వినియోగాన్ని పెంచడం లక్ష్యంగా దీనిని తీసుకొచ్చారు. భవిష్యత్తులో ఇథనాల్ అందుబాటు మరింత పెరిగితే, కంపెనీ తన ఇతర మోడళ్లను కూడా ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీతో అందించేందుకు సిద్ధంగా ఉంది.
ప్రస్తుతం ఉన్న మోడళ్లకు మాత్రమే కాకుండా భవిష్యత్తులో విడుదలయ్యే కొత్త బైక్లలో కూడా ఫ్లెక్స్ ఫ్యూయల్ ఆప్షన్లు ఉండే అవకాశం ఉన్నట్లు హీరో తెలిపింది. అవసరమైతే కొన్ని మోడళ్లను E100 ఇంధనానికి అనుగుణంగా కూడా రీ-ఇంజనీర్ చేయవచ్చని కంపెనీ ప్రకటించింది. అంతేకాదు, ఇప్పటికే మార్కెట్లో ఉన్న BS6 బైక్ల కోసం కూడా హీరో ప్రత్యేక రెట్రోఫిట్ కిట్లను అభివృద్ధి చేస్తోంది. ఈ కిట్ల సహాయంతో ప్రస్తుతం వినియోగంలో ఉన్న కొన్ని బైక్లను కూడా E85 ఇంధనంపై నడిచేలా మార్చే అవకాశం ఉంటుంది. వినియోగదారులకు కొత్త బైక్ కొనాల్సిన అవసరం లేకుండా ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ ప్రయోజనాలు పొందేందుకు ఉపయోగపడుతుంది.
హీరో అభివృద్ధి చేసిన ఈ E85 వెర్షన్లను జైపూర్లోని కంపెనీ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ (CIT)లో రూపొందించారు. ఇంధన రంగంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ సాంకేతికతను అభివృద్ధి చేసినట్లు కంపెనీ చెబుతోంది.
స్ప్లెండర్ ప్లస్, హెచ్ఎఫ్ డీలక్స్ E85 వెర్షన్లు 2026 నుంచి దశలవారీగా మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి. మొదటి దశలో ఢిల్లీ, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో వీటిని విక్రయించనున్నారు. ఆ తర్వాత డిమాండ్, ఇంధన లభ్యత ఆధారంగా ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించే అవకాశం ఉంది. మొత్తంగా ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీపై హీరో మోటోకార్ప్ దూకుడుగా ముందుకు సాగుతోంది. భవిష్యత్తులో కంపెనీ మొత్తం టూ వీలర్స్ ను ఈ టెక్నాలజీతో అందుబాటులోకి వస్తే, దేశంలో ప్రత్యామ్నాయ ఇంధన వినియోగం మరింత వేగంగా పెరిగే అవకాశం ఉంది.
Read Also: E85 ఫ్యూయల్ వచ్చేసింది.. పెట్రోల్ కంటే చీప్.. కానీ ఓ ట్విస్ట్ ఉందండోయ్!