EV Sales: దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల (EV) హవా నడుస్తోంది. పర్యావరణ స్పృహ పెరగడం, పెట్రోల్ భారానికి ప్రత్యామ్నాయం వెతుక్కోవడంతో జనాలు ఈవీల వైపు వేగంగా అడుగులు వేస్తున్నారు. దీనికి అద్దం పడుతూ.. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) తాజాగా విడుదల చేసిన గణాంకాలు సరికొత్త రికార్డులను సృష్టించాయి. జూన్ నెలలో దేశవ్యాప్తంగా ఈవీ అమ్మకాలు ఊపందుకున్నాయి.
జూన్ నెలలో సరికొత్త రికార్డు
ఫాడా డేటా ప్రకారం.. జూన్ నెలలో దేశవ్యాప్తంగా ఏకంగా 3 లక్షల 6 వేల 220 ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. గతేడాది జూన్ నెలతో పోల్చి చూస్తే ఇది ఏకంగా 63 శాతం వృద్ధిని సూచిస్తోంది. భారత ఆటోమొబైల్ చరిత్రలోనే ఒకే ఒక్క నెలలో ఈ స్థాయిలో భారీగా ఈవీల సేల్స్ జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం.
టూవీలర్స్దే అగ్రస్థానం
మన దేశ ఈవీ మార్కెట్ను టూవీలర్స్ విభాగం ముందుండి నడిపిస్తోంది. జూన్ నెల మొత్తం అమ్మకాల్లో వీటి వాటానే ఎక్కువగా ఉంది. జూన్లో లక్షా 93 వేల ఎలక్ట్రిక్ బైకులు, స్కూటర్లు అమ్ముడయ్యాయి. మొత్తం అమ్మకాలలో వీటి వాటానే 74 శాతంగా ఉంది. ఈ విభాగంలో 31 వేల 823 ఎలక్ట్రిక్ కార్లు, వ్యాన్లు అమ్ముడుపోయాయి. మూడు చక్రాల వాహనాల విభాగంలో 77 వేల 448 ఈవీ ఆటోలు అమ్ముడయ్యాయి. వ్యాపార అవసరాలకు వాడే కమర్షియల్ ఈవీల అమ్మకాలు ఏకంగా 163 శాతం పెరిగి, 3 వేల 214 వాహనాలుగా నమోదయ్యాయి.
Also Read: మరో పిడుగు.. E20 స్థానంలో E25 ఇంధనం, ధర తగ్గుతాది ఒకే.. మరి ఆ డ్యామేజ్?
ఈవీల వైపు మొగ్గు చూపడానికి కారణాలు
కస్టమర్లు సాంప్రదాయ ఇంధన వాహనాలను వదిలి ఈవీల వైపు మళ్లడానికి చాలా బలమైన కారణాలు ఉన్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి భారంగా మారాయి. వీటికి తోడు ఈవీల వల్ల రన్నింగ్ కాస్ట్, మెయింటెనెన్స్ ఖర్చులు చాలా తక్కువగా ఉండటం కస్టమర్లను ఆకర్షిస్తోంది. ప్రస్తుతం వస్తున్న మెరుగైన బ్యాటరీ టెక్నాలజీ, నగరాల్లో వేగంగా పెరుగుతున్న ఛార్జింగ్ స్టేషన్ల నెట్వర్క్ కూడా వాహనదారుల్లో నమ్మకాన్ని పెంచాయి. వీటికి తోడు ప్రభుత్వ ప్రోత్సాహకాలు, కంపెనీలు సరికొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకురావడం ఈ రంగానికి మరింత ఊపునిచ్చింది.
భవిష్యత్తు ఈవీలదే..
రాబోయే రోజుల్లో దేశీయ ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాలదే పైచేయి కానుందని మార్కెట్ నిపుణులు బలంగా అంచనా వేస్తున్నారు. ఈవీల వాడకం పెరగడం వల్ల నగరాల్లో కాలుష్యం తగ్గడమే కాకుండా, క్రూడ్ ఆయిల్ దిగుమతుల కోసం ఇతర దేశాలపై ఆధారపడటం కూడా తగ్గుతుంది. ఇది పరోక్షంగా దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఎంతగానో దోహదపడుతుంది.
Also Read: రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనేశాడు.. నువ్వు మామూలోడివి కాదు భయ్యా!