E25 Petrol: వాహనదారులకు సరికొత్త ఇంధనం పరిచయం కాబోతోంది. ఇదే సమయంలో చమురు దిగుమతులు తగ్గించుకోవడమే లక్ష్యంగా కేంద్రం వడివడి అడుగులు వేస్తోంది. ప్రస్తుతం సక్సెస్ఫుల్గా E20 ఇంధనం నడుస్తుండగా.. ఇప్పుడు E25 పెట్రోల్ వైపు అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం కనిపిస్తోంది.
రాబోతున్న E25 పెట్రోల్..
భారత్ ఇథనాల్ బ్లెండింగ్లో ఊహించిన దానికంటే వేగంగా పురోగతి సాధించింది. నిజానికి E25 పెట్రోల్ను 2030 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే పక్కా ప్రణాళికతో ఆ మైలురాయిని ఐదేళ్ల ముందే అధిగమించింది. కట్ చేస్తే.. ఇంధనంలో ఇథనాల్ శాతం పెంచడం అంత సులువు కాదు. నిజానికి ఇథనాల్ శాతం పెరిగేకొద్దీ వాహనాల ఇంజిన్ పనితీరు, ఇంధన ఫ్యూయల్ సిస్టమ్స్, మైలేజీపై ఎఫెక్ట్ ఉంటుంది. అందుకే ప్రభుత్వం ఈ అంశాలపై అధ్యయనం చేస్తోంది. ఆటోమొబైల్ తయారీ సంస్థలు, నిపుణుల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్, సూచనలను పరిగణనలోకి తీసుకుని.. ఇంజిన్లకు ఎలాంటి నష్టం జరుగకుండా ఉండేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
Also Read: నిజామాబాద్ జిల్లాలో దారుణం.. భార్య చేతిలో భర్త దారుణ హత్య!
E20 అంటే..
వాస్తవానికి చమురు సంస్థలో E20 అంటే 20% ఇథనాల్, 80% పెట్రోల్. ప్రస్తుతం భారతదేశంలో చాలా కొత్త వాహనాలు E20 ఇంధనానికి అనుకూలంగా తయారవుతున్నాయి. దీని వల్ల పెట్రోల్ వినియోగం తగ్గి, ఇంధన దిగుమతులపై ఆధారపడటం కొంత తగ్గుతుంది.
E25 పెట్రోల్ సరఫరాకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
వాస్తవానికి చమురు సంస్థలు E25 పెట్రోల్ సరఫరాకు ఏర్పాట్లను పూర్తి చేసుకున్నాయి. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే మార్కెట్లోకి విడుదల చేయనున్నాయి. అంతేకాదు భవిష్యత్తులో కేవలం E25 మాత్రమే కాకుండా.. E22, E27, E30 ప్రమాణాలను కూడా ప్రభుత్వం ముందే డిజైన్ చేసి ఉంచింది. అటు అధిక ఇథనాల్ కల్గిన పెట్రోల్పై పన్ను మినహాయింపులు ఇచ్చేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. దీనివల్ల భవిష్యత్తులో ఇథనాల్ పెట్రోల్ వినియోగం పెరగడమే కాకుండా, వాహనదారులపై ఇంధన భారం కొంత తగ్గే అవకాశం కూడా ఉంది.