India’s First Bullet Train: దేశంలో తొలి బుల్లెట్ రైలు పట్టాలెక్కబోతోంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ లో భాగంగా దేశీయంగా తయారవుతున్న తొలి బుల్లెట్ రైలు నమూనాను 2027 ప్రారంభంలో రెడీ చేయాలని BEML భావిస్తోంది. ఈ రైలును బెంగళూరులోని ఆదిత్య తయారీ కేంద్రంలో పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో రూపొందిస్తున్నారు. అదే ఏడాది ఆగష్టు నాటికి బుల్లెట్ రైలు సేవలను ప్రారంభించాలని కేంద్రం భావిస్తోంది.
రైల్వే రంగంలో కీలకమైన ఈ ప్రాజెక్ట్ కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన ప్లాంట్ ను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ 2026 ఏప్రిల్లో ప్రారంభించారు. ప్రస్తుతం అక్కడ తయారీ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది తొలి నెలల్లోనే మొదటి రైలు సెట్ను సిద్ధం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు BEML అధికారులు తెలిపారు. ప్రోటోటైప్ తయారీ పూర్తయిన తర్వాత దానిని గుజరాత్ లోని సూరత్ డిపోకు తరలిస్తారు. అక్కడ పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహించనున్నారు. రైలు పూర్తిగా అందుబాటులోకి వచ్చే ముందు తయారీ కేంద్రంలో పరీక్షలు, డిపోలో పరీక్షలు, ఆపై ట్రాక్ పై ట్రయల్ రన్స్ నిర్వహిస్తారు. మొత్తం ప్రక్రియకు నాలుగు నుంచి ఆరు నెలల వరకు సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
భారత తొలి బుల్లెట్ రైలుకు ‘B28’ అనే పేరు ఖరారు చేశారు. గంటకు 280 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా దీనిని రూపొందిస్తున్నారు. ఈ హై స్పీడ్ రైలును 2027 మార్చి నాటికి సిద్ధం చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఒప్పందాన్ని 2024 అక్టోబర్లో చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) BEMLకు అప్పగించింది. ఒప్పందం ప్రకారం రెండు హై స్పీడ్ రైలు సెట్లను డిజైన్ చేసి తయారు చేయాల్సి ఉంటుంది. మొదటి దశలో B28 బుల్లెట్ రైలు గుజరాత్లోని సూరత్- వాపి నగరాల మధ్య నడవనుంది. ఈ మార్గం పొడవు సుమారు 97 కిలోమీటర్లు ఉంటుంది. ఇది దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మితమవుతున్న ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్ కారిడార్ లో భాగం.
రైల్వే శాఖ సమాచారం ప్రకారం 2027 ఆగస్టు నాటికి ఈ మార్గంలో ప్రయాణికుల సేవలను ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తొలి దశలో దేశంలోనే తయారైన B28 బుల్లెట్ రైలును ఉపయోగించి సేవలు అందించనున్నారు. ఇది విజయవంతమైతే భవిష్యత్తులో దేశంలోని ఇతర హై స్పీడ్ రైల్ మార్గాల్లో కూడా ఇలాంటి స్వదేశీ బుల్లెట్ రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దేశ రైల్వే చరిత్రలో ఈ ప్రాజెక్ట్ ఒక మైలురాయిగా నిలవనుంది. స్వదేశీ సాంకేతికతతో రూపొందుతున్న ఈ బుల్లెట్ రైలు దేశ రవాణా రంగానికి కొత్త దిశను చూపడంతో పాటు వేగవంతమైన ప్రయాణ సేవలకు నాంది పలకనుంది.
Read Also: దేశ వ్యాప్తంగా 10 వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్!