Vande Bharat Sleeper Services: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్లు ఇప్పటికే ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రిపూట సుదూర ప్రయాణాలను మరింత వేగవంతంగా, సౌకర్యవంతంగా మార్చేందుకు మరిన్ని వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టాలని భావిస్తోంది.
దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు ప్రస్తుతం హౌరా-కామాఖ్య మార్గంలో నడుస్తోంది. 2025లో ప్రారంభమైన ఈ సర్వీస్ తూర్పు, ఈశాన్య భారతాన్ని లింక్ చేస్తోంది. సాధారణ స్లీపర్ రైళ్లతో పోలిస్తే ఆధునిక సౌకర్యాలు, మెరుగైన వేగంతో ప్రయాణికులకు కొత్త అనుభూతిని అందిస్తోంది. ఇదే తరహాలో మరిన్ని వందే భారత్ స్లీపర్ రైళ్లను దేశ వ్యాప్తంగా ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే కొన్ని మార్గాలకు ఆమోదం లభించగా, మరికొన్ని మార్గాలు పరిశీలనలో ఉన్నాయి.
ప్రతిపాదిత వందేభారత్ స్లీపర్ మార్గాల్లో ముఖ్యమైనది ముంబై-బెంగళూరు. ఈ రెండు ప్రధాన నగరాల మధ్య వందే భారత్ స్లీపర్ రైలు నడపడానికి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆమోదం ఇచ్చినట్లు సమాచారం. ఇది ప్రారంభమైతే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. అలాగే దేశ రాజధాని ఢిల్లీ నుంచి ముంబైకి కూడా వందే భారత్ స్లీపర్ రైలు నడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశ రాజకీయ, ఆర్థిక కేంద్రాలను కలిపే ఈ మార్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. న్యూఢిల్లీ-అహ్మదాబాద్ మార్గం కూడా భవిష్యత్తులో వందే భారత్ స్లీపర్ సేవలు పొందే అవకాశం ఉన్న కారిడార్లలో ఒకటిగా చర్చలో ఉంది. ఇదే విధంగా న్యూఢిల్లీ-హౌరా మార్గాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఈ రూట్ లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల ప్రీమియం సర్వీస్కు మంచి డిమాండ్ ఉండొచ్చని భావిస్తున్నారు.
ఉత్తర, దక్షిణ భారతదేశాలను కలిపే న్యూఢిల్లీ-చెన్నై మార్గం కూడా జాబితాలో ఉంది. ఈ సర్వీస్ ప్రారంభమైతే సుదూర ప్రయాణికులకు మరింత సౌకర్యం కలగనుంది. అలాగే న్యూఢిల్లీ-సికింద్రాబాద్ మార్గాన్ని కూడా రైల్వే అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.అటు పూణేకు పెరుగుతున్న ప్రాధాన్యత నేపథ్యంలో న్యూఢిల్లీ-పూణే మార్గాన్ని కూడా వందే భారత్ స్లీపర్ కోసం పరిశీలిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ప్రీమియం రైళ్లతో ప్రసిద్ధి చెందిన ముంబై-అహ్మదాబాద్ మార్గం కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకుంది. కాశ్మీర్కు రైల్వే అనుసంధానం పూర్తవుతున్న నేపథ్యంలో న్యూఢిల్లీ-శ్రీనగర్ మార్గంపై కూడా చర్చ జరుగుతోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
వందే భారత్ స్లీపర్ రైళ్లు పూర్తిస్థాయి సౌకర్యాలతో, ఆధునిక సాంకేతికతతో, వేగవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం ప్రకటించిన మార్గాలతో పాటు భవిష్యత్తులో మరిన్ని కారిడార్లు కూడా జాబితాలో చేరే అవకాశం ఉంది. వందే భారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి వస్తే సుదూర ప్రయాణాల్లో కొత్త మార్పుకు నాంది పలికే అవకాశముంది.
Read Also: ఒకే ట్రిప్ లో 8 పవిత్ర పుణ్యక్షేత్రాల దర్శనం, IRCTC అదిరిపోయే టూర్ ప్లాన్!