UPI Charges: దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన యూపీఐ సేవలు.. కీలకమైన మార్పులు దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు ఉచితంగా అందుతున్న ఈ డిజిటల్ సేవలపై భవిష్యత్తులో రుసుములు వసూలు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ‘పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్’కు సవరణలు ప్రతిపాదించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ ప్రతిపాదిత చట్టపరమైన మార్పు.. యూపీఐ లావాదేవీలకు సైతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) అమలు చేయడానికి మార్గం సుగమం చేస్తోంది.
డిజిటల్ చెల్లింపు సేవలను వినియోగించుకున్నందుకు గాను బ్యాంకులు లేదా పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు వ్యాపారులు చెల్లించే రుసుమునే ఎండీఆర్ (MDR) అంటారు. క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై వ్యాపారులు సాధారణంగా 1.5 శాతం వరకు ప్రాసెసింగ్ ఛార్జీలు చెల్లిస్తుండగా.. డెబిట్ కార్డ్లపై కూడా అదే విధంగా కొంత రుసుము ఉంటుంది. కానీ ఇప్పటివరకు యూపీఐకి ఎలాంటి ఛార్జీలు లేకపోవడం వల్లే ఇది వ్యాపారులకు, వినియోగదారులకు బాగా దగ్గరైందని చెప్పవచ్చు. ఇప్పుడు ఛార్జీలు అంశంపై చర్చ మెుదలైన నేపథ్యంలో యూపీఐ యూజర్లకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.
పార్లమెంటులో చట్ట సవరణ ప్రతిపాదన వచ్చినప్పటికీ.. వెంటనే యూపీఐపై ఎలాంటి ఛార్జీలు అమల్లోకి రావని తెలుస్తోంది. భవిష్యత్తులో అవసరమైతే ఎండీఆర్ విధించడానికి కేంద్రానికి అధికారాన్ని కల్పించే ఒక చట్టపరమైన వెసులుబాటుగా మాత్రమే ఈ ప్రతిపాదన ద్వారా తీసుకొచ్చారు. ఎంత చార్జీ ఉండాలి? ఏ రకమైన లావాదేవీలకు వర్తింపజేయాలి? అనే అంశాలపై అధికారులు ఇంకా చర్చలు జరుపుతున్నారు. రేటు లేదా పరిమితులపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని ప్రస్తుతం ఉన్న వ్యవస్థ ప్రకారం యూపీఐ సేవలు యథావిధిగా ఉచితంగానే కొనసాగుతాయని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
పరిశీలనలో ఉన్న ప్రతిపాదనల ప్రకారం.. రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన లావాదేవీలపై 0.3 శాతం నుండి 0.5 శాతం వరకు ఎండీఆర్ విధించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ భారం కేవలం రూ.1.5 కోట్లకు పైగా వార్షిక టర్నోవర్ ఉన్న పెద్ద వ్యాపారులపై మాత్రమే పడేలా డిజైన్ చేస్తున్నారు. దీనివల్ల సాధారణ వినియోగదారులపై గానీ, వీధి వ్యాపారులు, చిన్న దుకాణదారులపై గానీ ఎలాంటి అదనపు భారం పడదు. మరోవైపు వార్షిక టర్నోవర్ ఆధారంగా కూడా ఛార్జీలను నిర్ణయించే అవకాశాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
యూపీఐ సేవలను రూపాయి రాబడి లేకుండా ఉచితంగా అందించడం వల్ల సుస్థిరమైన వ్యాపార నమూనాను నిర్మించడం కష్టంగా మారిందని సర్వీస్ ప్రొవైడర్లు వాపోతున్నారు. కొత్త సాంకేతికతపై పెట్టుబడులు పెట్టడానికి, భద్రతను పెంచడానికి, నెట్వర్క్ను విస్తరించడానికి ఆదాయం అవసరమని చెబుతున్నారు. అధిక విలువ కలిగిన లావాదేవీలపై స్వల్పంగా ఎండీఆర్ విధించడం వల్ల ఈ రంగానికి ఆర్థిక స్థిరత్వం లభిస్తుందని ప్రతిపాదిస్తున్నారు.
Also Read: కుమారుడు ఉదయనిధి అరెస్ట్.. సీఎం విజయ్పై విరుచుకుపడ్డ ఎం.కె. స్టాలిన్!
ఇదిలా ఉంటే ప్రస్తుతం యూపీఐ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. జులై నెలలోనే రూ. 29.9 ట్రిలియన్ల విలువైన 2,360 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఇందులో ఫోన్పే, గూగుల్ పే యాప్లే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అనలిటిక్స్ సంస్థ జెఫ్రీస్ నివేదిక ప్రకారం.. రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన లావాదేవీలు మొత్తం సంఖ్యలో కేవలం 4 శాతమే ఉన్నప్పటికీ.. మొత్తం లావాదేవీల విలువలో ఇవి ఏకంగా 67 శాతాన్ని ఆక్రమించాయి. ఈ లావాదేవీలపై ఎండీఆర్ విధిస్తే డిజిటల్ చెల్లింపుల రంగానికి ఏడాదికి రూ. 5,000 కోట్ల నుండి రూ. 10,000 కోట్ల వరకు రాబడి వచ్చే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి.
Also Read: భారత ఐటీ ఉద్యోగులకు ట్రంప్ బిగ్ షాక్.. వీసా పొడిగింపు పైనా ‘బాదుడే బాదుడు’!