Stock Market Crash: నాలుగు రోజులు స్వల్ప లాభాలతో నడిచిన బాంబే స్టాక్ మార్కెట్ శుక్రవారం భారీగా ఒడిదుడుకులకు లోనైంది. ఇవాళ ఉదయం మార్కెట్ ప్రారంభమైన నుంచి వివిధ రంగాలు షేర్లు భారీగా పతనమయ్యాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఐటీ, ఆటో, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్స్ సర్వీసు వంటి రంగాల్లో బేర్ వీర విహారం చేసింది.
స్టాక్ మార్కెట్ భారీ పతనం.. పేక మేడలా కూలిన ఐటీ షేర్లు
అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలు దేశీయ స్టాక్ మార్కెట్ని తాకింది. దీంతో శుక్రవారం ఉదయం స్టాక్ మార్కెట్ ప్రారంభమైన నుంచి పతనం కొనసాగుతోంది. ముఖ్యంగా ఐటీ రంగంలోని షేర్ల అమ్మకాలు సూచీలను కుదిపేశాయి. ఆదిలో బీఎస్ఈ సెన్సెక్స్ దాదాపు 800 పాయింట్లు కోల్పోయింది. అటు నిఫ్టీ 24 వేల మార్క్ దిగువ ట్రేడవుతోంది.
ఈ పతనంతో మదుపరుల సంపద సుమారు రూ.2లక్షల కోట్ల మేరా ఆవిరైనట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఉదయం 10.30 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 730 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 200 పాయింట్లు తగ్గి 23,949 వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. డాలర్తో రూపాయి మారకం విలువ 10 పైసలు పెరిగింది. ప్రస్తుతం 94.30 వద్ద ట్రేడ్ కొనసాగుతోంది.
ఫార్మా రంగం తప్పా.. మిగతా రంగాల పతనం
టెక్ సంస్థ యాక్సెంచర్ తన ఆదాయ వృద్ధి అంచనాలను తగ్గించినట్టు తెలుస్తోంది. దీంతో భవిష్యత్తులో డిమాండ్ బలహీనంగా ఉండొచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మదుపరుల సెంటిమెంట్ని దారుణంగా దెబ్బతీసింది. ఫలితంగా అమ్మకాలకు పాల్పడ్డారు. నిఫ్టీ ఐటీ సూచీ దాదాపు 5.48 శాతం పతనమైంది.
ఇన్ఫోసిస్ షేర్లు 7.7శాతం, టీసీఎస్ షేర్లు-5.8 శాతం, టెక్ మహీంద్రా-4.5 శాతం, హెచ్ సీఎల్-4.3 శాతం, విప్రో-3.2 శాతం కంపెనీల షేర్లు పతనమయ్యాయి. ప్రస్తుతం ట్రేడింగ్ కొనసాగుతోంది. గతరాత్రి అమెరికా మార్కెట్లో యాక్సెంచర్ షేర్లు ఏకంగా 15 శాతం మేరా పతనమైంది.
ALSO READ: బంగారం కొనుగోలు,పెట్టబడులకు రైట్ టైమ్, 40 శాతం పెరగడం ఖాయం?
భారత ఐటీ కంపెనీలకు ఆదాయ వనరు అమెరికా మార్కెట్. పలు ఐటీ కంపెనీలు భారీ ఒప్పందాలు చేసుకుంటున్నాయి. వాటి ఫలితాలు ఆదాయ రూపంలో కనిపించలేదు. క్లయింట్లు ఖర్చుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించడం, అవసరం లేని ప్రాజెక్టులను డిలే చేస్తున్నాయి. ఏఐపై చర్చ కొనసాగుతోంది.
ఈ పతనం సంకేతమా? తాత్కాలికం మాత్రమేనా అన్నది ఇప్పుడే చెప్పలేమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ట్రేడింగ్ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలో అమ్మకాల వెల్లువెత్తడంతో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్లో సుమారు రూ. 2 లక్షల కోట్ల సంపద ఆవిరయ్యింది.