Kohinoor Diamond: కోహినూర్ వజ్రం పేరు వినగానే ఒక రకమైన విచిత్రమైన భావన కలుగుతుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధమైన, వెలకట్టలేని ఈ రత్నం వెనుక ఎన్నో కథలు, గాథలు, అంతకంటే ఎక్కువ రహస్యాలు దాగి ఉన్నాయి. భారతదేశంలోని కాకతీయుల నేల గోల్కొండ గనుల నుంచి బయటపడిన ఈ వజ్రం, శతాబ్దాల కాలంలో ఎన్నో చేతులు మారింది. అయితే ఈ వజ్రం ఏ రాజవంశం చేతికి వెళ్లినా, వారు కొద్దికాలంలోనే సర్వనాశనం కావడం లేదా తీవ్రమైన మానసిక, శారీరక వేదనలను అనుభవించడం వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటి అనే అంశం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది.
కోహినూర్ వజ్రానికి ఒక శాపం ఉందనే ప్రచారం ఈనాటిది కాదు. క్రీస్తు శకం 1306 నాటి హిందూ గ్రంథాలలోనే దీని గురించిన ఒక ముఖ్యమైన పత్రం ఉంది. ఈ వజ్రాన్ని ఎవరు కలిగి ఉంటే వారు ప్రపంచాన్ని ఏలుతారు, కానీ దాంతోపాటు వారి జీవితాల్లోకి అనేక కష్టాలు, విపత్తులు వస్తాయి అని అందులో రాసి ఉంది. కేవలం దేవుళ్లు లేదా మహిళలు మాత్రమే దీనిని ఎలాంటి ప్రమాదం లేకుండా ధరించగలరని, సాధారణ పురుష రాజులు దీనిని తాకితే నాశనం త తప్పదని ఆ కాలంలోనే నమ్మేవారు.
చరిత్ర పుటలను ఒక్కసారి తిరగేస్తే.. ఈ వజ్రం తాకిన రాజవంశాల పతనం స్పష్టంగా కనిపిస్తుంది. మొదటగా దీనిని కలిగి ఉన్న కాకతీయ సామ్రాజ్యం డిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ దండయాత్రతో అంతమైపోయింది. ఆ తర్వాత ఈ వజ్రం ఖిల్జీల చేతికి, ఆపై తుగ్లక్, లోడీ వంశాల చేతికి మారింది. వీరందరి పాలన రక్తసిక్తంగా, కుట్రలతో ముగిసింది.
చివరకు మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ చేతికి చేరిన ఈ రత్నాన్ని, తర్వాతి కాలంలో షాజహాన్ తమ ప్రసిద్ధ నెమలి సింహాసనంలో అమర్చుకున్నాడు. షాజహాన్ తన సొంత కొడుకు ఔరంగజేబు చేతిలోనే బందీగా మారి చివరి రోజుల్లో నరకం చూశాడు. ఔరంగజేబు తర్వాత మొఘల్ సామ్రాజ్యం కూడా వేగంగా క్షీణించిపోయింది.
Also Read: బాటా అస్సలు ఇండియన్ కంపెనీయే కాదు, దీని చరిత్ర తెలిస్తే వావ్ అంటారు!
మొఘలుల బలహీనతను ఆసరాగా చేసుకుని పర్షియా పాలకుడు నాదిర్ షా భారతదేశంపై పడి కోహినూర్ వజ్రాన్ని దోచుకెళ్లాడు. ఈ వజ్రాన్ని చూసి ఆశ్చర్యపోయిన అతడే దీనికి ‘కోహినూర్’ అంటే వెలుగుల పర్వతం అని పేరు పెట్టాడు. అయితే ఈ వజ్రం దక్కించుకున్న కొద్ది కాలానికే నాదిర్ షా సొంత సైనికుల చేతిలోనే అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు.
ఆ తర్వాత అఫ్గాన్ పాలకుడు అహ్మద్ షా దుర్రానీ చేతికి ఇది వచ్చింది. అతడు, అతని వారసులు కూడా విపరీతమైన అంతర్యుద్ధాలు, అంధత్వ శిక్షలు, పతనాలతో ముగిసిపోయారు. చివరకు పంజాబ్ కేసరి మహారాజా రంజిత్ సింగ్ ఈ వజ్రాన్ని అఫ్గాన్ల నుంచి తిరిగి భారత్కు తెచ్చాడు. ఆయన మరణం తర్వాత కొద్ది సంవత్సరాల్లోనే ఆయన సామ్రాజ్యం ముక్కలైంది. ఆయన చిన్న కుమారుడు దులీప్ సింగ్ చిన్న వయస్సులోనే రాజ్యాన్ని, ఈ వజ్రాన్ని బ్రిటిష్ వారికి అప్పగించాల్సి వచ్చింది.
కోహినూర్ వజ్రం పట్ల ఉన్న ప్రాచీన శాపం గురించి బ్రిటిష్ వారికి పూర్తి అవగాహన ఉంది. పురుష రాజులు దీనిని ధరిస్తే సామ్రాజ్యం పతనం అవుతుందనే భయం వారిని వెంటాడింది. అందుకే ఈ వజ్రాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ విక్టోరియా రాణికి బహుమతిగా ఇచ్చినప్పుడు, ఒక ప్రత్యేకమైన నిబంధన విధించారు.
దాని ప్రకారం ఈ వజ్రాన్ని బ్రిటిష్ రాజకుటుంబంలోని మహిళలు, ముఖ్యంగా రాణి మాత్రమే ధరించాలి. రాజ కిరీటంలో ఉన్న పురుషులు లేదా వారసులు దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ ధరించకూడదని. ఈ ఆచారమే ఇప్పటికీ కొనసాగుతోంది. విక్టోరియా రాణి, మేరీ రాణి, ఆ తర్వాత ఎలిజబెత్ రాణి తల్లులు మాత్రమే దీనిని తమ కిరీటంలో ధరించారు.
శాస్త్రీయంగా ఆలోచిస్తే ఒక రాయి లేదా వజ్రం ఒక సామ్రాజ్యాన్ని నాశనం చేస్తుందనేది కేవలం ఒక మూఢనమ్మకం మాత్రమే. చరిత్రలో ఒక రాజ్యం పతనం కావడానికి రాజకీయ కారణాలు, సైనిక బలహీనతలు, అంతర్గత కుట్రలు, ఆర్థిక సంక్షోభాలు ప్రధాన కారణాలుగా ఉంటాయి.
అయితే ఈ వజ్రం ఎంతో విలువైనది కావడం వల్ల దీనిని దక్కించుకోవడానికి రాజుల మధ్య విపరీతమైన ఆరాటం, కుట్రలు, హత్యలు జరిగాయి. ఆ అధికార దాహమే ఆయా రాజవంశాల నాశనానికి దారితీసింది. కాకపోతే ఈ సంఘటనలన్నీ వరుసగా జరగడం వల్ల కోహినూర్ చుట్టూ శాపం అనే ఒక గొప్ప కథ అల్లబడింది, అది ఇప్పటికీ జనాల్లో ప్రచారంలో ఉంది.
Also Read: అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే ముప్పుతిప్పలు పెడుతున్న ‘వొయ్నిచ్’ మిస్టరీ!