Nitin Gadkari on E20 Fuel: దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ మైలేజ్ గురించి చర్చ కొనసాగుతున్న వేళ కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు మరోసారి ఆసక్తి రేపాయి. సాధారణ కారు యజమాని తన వెహికల్ మైలేజీని కచ్చితంగా కొలవలేడని, ఇందుకోసం కంపెనీ అధీకృత డీలర్ దగ్గర ఉన్న ఎక్యుప్ మెంట్స్ ను మాత్రమే నమ్మాలన్నారు. అయితే ఆటో నిపుణులు మాత్రం మంత్రి వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు.
ఒక టీవీ ఇంటర్వ్యూలో జర్నలిస్టు తన కారు E20 పెట్రోల్ వాడిన తర్వాత సిటీలో లీటరుకు 11 కిలోమీటర్ల నుంచి 7 కిలోమీటర్లకు మైలేజీ పడిపోయిందని చెప్పింది. దీనిపై స్పందించిన గడ్కరీ, ఆ లెక్క ఎలా వేశారని ప్రశ్నించారు. సదరు జర్నలిస్టు డ్యాష్ బోర్డ్ లో కనిపించే మైలేజీ ఆధారంగా చెప్పానని వివరించారు. అయితే, డ్యాష్ బోర్డ్ రీడింగ్ పూర్తిగా కచ్చితమైనది కాదన్నారు మంత్రి. కంపెనీ ఆథరైజ్డ్ డీలర్ దగ్గర ఉన్న ప్రత్యేక పరికరాలతో పరీక్షించినప్పుడే సరైన సమాచారం తెలుస్తుందన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పలువురు నెటిజన్లు ఆయన కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. E20 పెట్రోల్ కు సంబంధించి ఆయన చేస్తున్న కామెంట్స్ సరిగా లేవంటున్నారు. కొంత మంది ఆయన మానసిక బాగానే ఉందా? అంటూ ట్రోల్ చేస్తున్నారు.
ఇటీవల కేంద్ర పెట్రోలియం శాఖ కూడా E20 పెట్రోల్ వాడితే కొన్ని వాహనాల్లో ఇంధన సామర్థ్యం 3 నుంచి 5 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని అంగీకరించింది. అయితే, మైలేజీ ఒక్కటే ప్రమాణం కాదని, చమురు దిగుమతిని తగ్గించడం, కాలుష్యాన్ని నియంత్రించడం లాంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
పూర్తిగా ల్యాబ్ స్థాయి కచ్చితత్వంతో కాకపోయినా, కారు యజమానులు తమ వాహనం మైలేజీని తెలుసుకునే అవకాశం ఉంది. లేటెస్ట్ కార్లలో డ్యాష్ బోర్డ్ మీద కనిపించే మైలేజీ ఇంజిన్, ఇంధన వినియోగం, ప్రయాణించిన దూరం లాంటి వివరాల ఆధారంగా లెక్కించబడుతుంది. ఇది సాధారణంగా వాస్తవ మైలేజీకి చాలా దగ్గరగా ఉంటుంది. ఆటోమొబైల్ నిపుణులు ఇప్పటికీ ఫుల్ ట్యాంక్ మెథడ్ అత్యంత నమ్మదగిన మార్గం అంటున్నారు. ముందుగా ట్యాంక్ ను పూర్తిగా నింపాలి. తర్వాత ట్రిప్ మీటర్ ను రీసెట్ చేసి, కొంత దూరం సాధారణంగా ప్రయాణించాలి. మళ్లీ ట్యాంక్ నింపేటప్పుడు పోసిన లీటర్లతో ప్రయాణించిన కిలోమీటర్లను భాగిస్తే వాస్తవ మైలేజీకి దగ్గరగా ఉండే ఫలితం వస్తుందంటున్నారు.
కంపెనీ డయాగ్నస్టిక్ టూల్ కేవలం మైలేజీని మాత్రమే కొలవదు. ఇంజిన్ కంట్రోల్ యూనిట్, ఫ్యూయల్ ఇంజెక్టర్లు, ఆక్సిజన్ సెన్సార్లు, ఎయిర్ఫ్లో సెన్సార్లు లాంటి భాగాలు సరిగా పనిచేస్తున్నాయా? లేదా? అనేది పరీక్షిస్తుంది. అలాగే ఇంజిన్ లో ఏవైనా లోపాలు ఉన్నాయా, ECU సెట్టింగ్స్ సరిగ్గా ఉన్నాయా? అనే విషయాలను కూడా గుర్తిస్తుంది. అయితే రోడ్డుపై ఎంత మైలేజీ వస్తుందో చెప్పదు. ట్రాఫిక్, రోడ్ల పరిస్థితి, ఎయిర్ కండిషనర్ వినియోగం, టైర్ ప్రెజర్, డ్రైవింగ్ స్టైల్, వాహనంపై ఉన్న బరువు లాంటి చాలా అంశాలు మైలేజీపై ప్రభావం చూపుతాయి. ఇవన్నీ పట్టించుకోకుండా గడ్కరీ కామెంట్స్ చేయడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: టాటా సియెర్రా EV కొనాలా? వద్దా? ముందుగా ఈ ప్లస్లు.. మైనస్లు తెలుసుకోండి!