దేశంలో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, టాటా మోటార్స్ తన ప్రీమియం ఈవీ ప్రాజెక్ట్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే చైనా ఆటో దిగ్గజం చెరీ నుంచి లేటెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ ప్లాట్ ఫారమ్ కు లైసెన్స్ పొందేందుకు టాటా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. టాటా ప్రీమియం ఎలక్ట్రిక్ కార్ల కోసం చెరీ, జాగ్వార్ ల్యాండ్ రోవర్ కలిసి అభివృద్ధి చేసిన ఫ్రీలాండర్ ప్లాట్ ఫారమ్ను ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి. ఈ వాహనాలను తమిళనాడులో టాటా ఏర్పాటు చేస్తున్న కొత్త తయారీ కేంద్రంలో ఉత్పత్తి చేయాలని కంపెనీ భావిస్తోంది.
టాటా ఇప్పటికే దేశంలో అతిపెద్ద ఈవీ తయారీ సంస్థగా గుర్తింపు పొందింది. ఇప్పుడు తన ప్రీమియం బ్రాండ్ అవిన్యా కింద ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రిక్ కార్లను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బ్రాండ్ కింద కనీసం రెండు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. అందులో తొలి మోడల్ 2027లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
వాస్తవానికి టాటా మొదట జాగ్వార్ ల్యాండ్ రోవర్ అభివృద్ధి చేసిన ఎలక్ట్రిఫైడ్ మాడ్యులర్ ఆర్కిటెక్చర్ ప్లాట్ ఫారమ్ ను ఉపయోగించాలని భావించింది. 2025 నాటికి అవినయ బ్రాండ్ కార్లను విడుదల చేయాలని కూడా లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, దేశంలో EMA ఆధారిత వాహనాల తయారీ ప్రణాళికలను JLR విరమించుకోవడంతో టాటా తన వ్యూహాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో చెరీ ప్లాట్ ఫారమ్ టాటాకు పెద్ద ఊరటగా మారింది. కొత్త టెక్నాలజీని పూర్తిగా అభివృద్ధి చేయడానికి అవసరమైన సమయం, భారీ పెట్టుబడిని ఆదా చేసుకునే అవకాశం కంపెనీకి లభించనుంది. అదే సమయంలో ప్రపంచ స్థాయి ఈవీల్లో ఉండే ఆధునిక ఫీచర్లు, సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వేగంగా అందిపుచ్చుకునే అవకాశం ఉంది.
ఫస్ట్ అవిన్యా ఈవీని చైనా నుంచి కిట్ రూపంలో భారత్ కు తీసుకొచ్చి ఇక్కడ అసెంబుల్ చేసే అవకాశం ఉంది. అదే సమయంలో స్థానికంగా భాగాలను తయారు చేసే ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. రెండో మోడల్ 2029లో విడుదలయ్యే అవకాశముండగా, భవిష్యత్తులో మరో రెండు ప్రీమియం ఈవీలను కూడా ఈ బ్రాండ్ కింద ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
చెరీ సంస్థ కూడా టాటాతో భాగస్వామ్యాన్ని ధృవీకరించింది. ఇప్పటికే జేఎల్ఆర్తో తమకు ఉన్న విజయవంతమైన అనుబంధానికి ఇది కొనసాగింపుగా ఉంటుందని తెలిపింది. టాటా ప్యాసింజర్ వాహన విభాగానికి సరఫరాదారుగా వ్యవహరించనున్నట్లు కూడా తెలిపింది. చెరీ ప్రస్తుతం చైనాలోనే అతిపెద్ద ఆటోమొబైల్ ఎగుమతిదారుగా కొనసాగుతోంది. కంపెనీ విదేశీ మార్కెట్లలో భారీగా వృద్ధి సాధిస్తోంది. మే 2026లో చెరీ మొత్తం 2.31 లక్షలకుపైగా వాహనాలను విక్రయించగా, అందులో 1.77 లక్షల యూనిట్లు విదేశీ మార్కెట్లలో అమ్ముడయ్యాయి.
Read Also: భారత ఆటో రంగంలో సరికొత్త అధ్యాయం.. ఫస్ట్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వాగన్ ఆర్ విడుదల!