Top Car News Of The Week: గత వారం భారత కార్ల మార్కెట్ లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కొత్త కార్ల లాంచ్ ల కంటే, ఇప్పటికే మార్కెట్లో ఉన్న మోడళ్లకు వచ్చిన అప్ డేట్లు, ఇంధన ధరల పెరుగుదల ఎక్కువ చర్చకు కారణం అయ్యాయి. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలు పెరగడం ఆటోమొబైల్ రంగంలోనే కాకుండా సామాన్య ప్రజల జీవితాలపై కూడా ప్రభావం చూపుతోంది.
గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావంతో దేశంలో ఇంధన ధరలు పెరుగుతున్నాయి. చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.3 వరకు పెంచగా, సీఎన్జీ ధరలు కూడా కిలోకు రూ.2 వరకు పెరిగాయి. రోజూ వాహనాలను ఉపయోగించే ప్రజల ఖర్చులు ఒక్కసారిగా పెరిగాయి. ఇదే గత వారం ఆటో రంగంలో హాట్ టాపిక్ గా మారింది.
ఇక కార్ల విషయానికి వస్తే, స్కోడా ఇండియా తన ప్రీమియం ఎస్యూవీ కోడియాక్ కు 2026 మోడల్ అప్ డేట్ ను ప్రకటించింది. కొత్త కోడియాక్ లో ఇప్పుడు లెవెల్-2 ADAS భద్రతా ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇవి డ్రైవింగ్ సమయంలో అదనపు భద్రతను అందిస్తాయి. ఈ ఫీచర్ల కారణంగా కొన్ని వేరియంట్ల ధరలు లక్ష రూపాయల వరకు పెరిగాయి. అయితే మరోవైపు, బేస్ వేరియంట్ ధరను తగ్గించడం ద్వారా స్కోడా వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేసింది.
టాటా మోటార్స్ ఆల్ట్రోజ్ CNG మోడల్లో కీలక మార్పులు చేసింది. ఇప్పటి వరకు మాన్యువల్ గేర్ బాక్స్ తో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ కారు, ఇప్పుడు AMT ట్రాన్స్ మిషన్ తో వచ్చింది. ఆటోమేటిక్ సౌకర్యం కోరుకునే వినియోగదారులకు ఇది మంచి ఆప్షన్గా మారింది. ముఖ్యంగా నగరాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో ఆటోమేటిక్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో టాటా ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
ఇక ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో కియా కీలక అడుగు వేసింది. కియా కేరెన్స్ క్లావిస్ ఈవీని బ్యాటరీ యాస్ ఏ సర్వీస్(BaaS) స్కీమ్ లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విధానంలో వినియోగదారులు బ్యాటరీని ప్రత్యేకంగా అద్దెకు తీసుకోవచ్చు. దీని వల్ల కారును కొనుగోలు చేసే సమయంలో ప్రారంభ ధర చాలా వరకు తగ్గుతుంది. ఈ స్కీమ్ ద్వారా కారు ధర సుమారు రూ.6 లక్షల వరకు తగ్గే అవకాశం ఉంది. అయితే, వినియోగదారులు ప్రతి కిలోమీటరుకు అదనంగా బ్యాటరీ రెంట్ చెల్లించాల్సి ఉంటుంది.
లగ్జరీ కార్ల విభాగంలో ఆడి రాబోయే Q9 ఎస్యూవీ ఇంటీరియర్ ను రివీల్ చేసింది. ఈ కారు విలాసవంతమైన ఫీచర్లు, భారీ డిస్ ప్లే లు, ప్రీమియం ఫినిషింగ్ తో ఆకట్టుకుంటోంది. 6, 7 సీటర్ ఆప్షన్లలో ఈ మోడల్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఈ SUV మార్కెట్లోకి రావొచ్చని తెలుస్తోంది.
ఇక రేంజ్ రోవర్ కూడా భారత్ లో కొత్త స్పోర్ట్ SV మోడల్ ను విడుదల చేసింది. ఈ కారు హై పర్ఫార్మెన్స్, ప్రీమియం డిజైన్ తో ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది.
Read Also: టాటా To మారుతి.. భారత మార్కెట్ లోకి ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్లు వచ్చేస్తున్నాయ్!