Flex-Fuel Cars in India 2026: ఇండియన్ ఆటోమొబైల్ రంగంలో 2026లో మరో లెవల్ కు చేరబోతోంది. ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్, సిఎన్జీ, ఎలక్ట్రిక్ కార్ల మధ్య పోటీ ఉండగా, త్వరలో ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు కూడా మార్కెట్లోకి అడుగు పెట్టేందుకు రెడీ అవుతున్నాయి. ప్రముఖ కార్ల తయారీ సంస్థలు మారుతి సుజుకి, టాటా మోటార్స్ చౌక ధరల్లో ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్లను తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాయి.
ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు అనేది సాధారణ పెట్రోల్ తో పాటు ఇథనాల్ తో కూడా చక్కగా నడుస్తుంది. ప్రస్తుతం దేశంలో E20 పెట్రోల్ అందుబాటులో ఉంది. అంటే అందులో 20 శాతం ఇథనాల్, మిగతా భాగం పెట్రోల్ ఉంటుంది. కానీ, ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు E85, E100 లాంటి హై ఇథనాల్ తోనూ పని చేస్తాయి. ఈ కార్లతో ముడి చమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. కాలుష్యం కూడా తగ్గే అవకాశం ఉంది.
మారుతి సుజుకి ఇప్పటికే ఫ్రాంక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కాన్సెప్ట్ ను అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించింది. సాధారణ ఫ్రాంక్స్ మాదిరిగానే కనిపించినా, ఇందులో ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీకి సంబంధించిన కొన్ని ప్రత్యేక మార్పులు చేశారు. కారుపై ఫ్లెక్స్ ఫ్యూయల్ స్టిక్కర్లు, కొత్త డిజైన్ టచ్ లు ఇచ్చాయి. ఈ కాంపాక్ట్ క్రాస్ ఓవర్ లో స్ప్లిట్ హెడ్ ల్యాంప్స్, స్టైలిష్ అల్లాయ్ వీల్స్, స్పోర్టీ లుక్ అలాగే ఉన్నాయి. మారుతి ప్రస్తుతం ఉపయోగిస్తున్న 1.2 లీటర్, 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్లు ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీకి అనుకూలంగా ఉన్నాయట. భవిష్యత్తులో ఫ్రాంక్స్ FFV మోడల్ భారత మార్కెట్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది అందుబాటు ధరలో వస్తే వినియోగదారుల నుంచి మంచి స్పందన రావొచ్చని ఆటో నిపుణులు భావిస్తున్నారు.
ఇక టాటా మోటార్స్ కూడా ఫ్లెక్స్ ఫ్యూయల్ రంగంలో అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. టాటా మోటార్స్ కాంపాక్ట్ ఎస్యూవీ పంచ్ ను ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్ లో తీసుకురావాలని యోచిస్తోంది. ఇప్పటికే కాన్సెప్ట్ రూపంలో దీనిని ప్రదర్శించారు. ఈ మోడల్లో 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ను ఉపయోగించారు. అయితే, ఫ్లెక్స్ ఫ్యూయల్ కు అనుగుణంగా ECU, ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్, ఎగ్జాస్ట్ సిస్టమ్లలో మార్పులు చేశారు. ఈ మార్పులతో కారు ఇంధనంలో ఎంత శాతం ఇథనాల్ ఉందో గుర్తించి దానికి అనుగుణంగా పనితీరును సర్దుబాటు చేసుకుంటుంది. ప్రస్తుతం టాటా పంచ్ పెట్రోల్, సిఎన్జీ, ఎలక్ట్రిక్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇప్పుడు ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్ కూడా వస్తే వినియోగదారులకు మరిన్ని ఆప్షన్స్ లభిస్తాయి.
ప్రస్తుతం భారత ప్రభుత్వం ఇథనాల్ వినియోగాన్ని పెంచేందుకు ప్రత్యేక ప్రోత్సాహం ఇస్తోంది. రైతుల నుంచి కొనుగోలు చేసే పంటల ద్వారా ఇథనాల్ ఉత్పత్తి పెరగడం వల్ల వ్యవసాయ రంగానికీ లాభం ఉంటుందని భావిస్తున్నారు. అదే సమయంలో పర్యావరణానికి హాని చేసే కాలుష్యాన్ని తగ్గించడంలో కూడా ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు సహాయపడతాయని చెబుతున్నారు.
Read Also: ఇక కారు స్క్రీన్ లోనే యూట్యూబ్ చూసేయొచ్చు.. ఆండ్రాయిడ్ ఆటోలో అదిరిపోయే ఫీచర్!