Electric Vehicles in India: దేశంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా ఇప్పుడు చాలా మంది ఎలక్ట్రిక్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఒకప్పుడు ఈవీలు కొత్త ట్రెండ్ లా కనిపించినా, ఇప్పుడు పెట్రోల్, డీజిల్, CNG కార్లకు గట్టి పోటీ ఇస్తున్నాయి. తక్కువ ఖర్చు, లేటెస్ట్ టెక్నాలజీ, సైలెంట్ డ్రైవింగ్ ఎక్సపీరియెన్స్ కారణంగా ఈవీలకు మంచి ఆదరణ లభిస్తోంది.
ఈవీలకు ఆదరణ పెరగడానికి ముఖ్యమైన కారణం.. రన్నింగ్ కాస్ట్ చాలా తక్కువ. ప్రస్తుతం పెట్రోల్ కార్లకు కిలో మీటరుకు సుమారు రూ.7 నుంచి రూ.10 వరకు ఖర్చవుతుంది. డీజిల్ కార్లకు రూ.5 నుంచి రూ.7 వరకు ఖర్చవుతుంది. CNG కార్లు కొంత వరకు తక్కువ ఖర్చుతో నడిచినా, EVలతో పోలిస్తే ఎక్కువగానే ఉంటుంది. ఎలక్ట్రిక్ కార్లను కిలోమీటరుకు కేవలం రూ.1 నుంచి రూ.2 ఖర్చుతో నడిపే అవకాశం ఉంటుంది. రోజూ ఆఫీసుకు వెళ్లే వారికి, ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ఎక్కువ డబ్బు ఆదా అవుతుంది.
పర్యావరణ పరంగా కూడా ఈవీలు మంచి ఆప్షన్ గా మారాయి. పెట్రోల్, డీజిల్ కార్లు పొగను విడుదల చేస్తాయి. గాలి కాలుష్యం పెరుగుతుంది. కానీ ఈవీల్లో టెయిల్ పైప్ ఉండదు. ఎలాంటి పొగ బయటకు రాదు. నగరాల్లో కాలుష్యం కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈవీలు బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.
డ్రైవింగ్ ఎక్స్ పీరియెన్స్ కూడా చాలా బాగుంటుంది. సాధారణ కార్లలో ఉండే ఇంజిన్ శబ్దం, షేకింగ్ ఈవీల్లో ఉండవు. కారు చాలా సైలెంట్ గా, స్మూత్ గా నడుస్తుంది. యాక్సిలరేషన్ కూడా వెంటనే అందుతుంది. ట్రాఫిక్ లో డ్రైవింగ్ చేసినప్పుడు ఒత్తిడి తక్కువగా అనిపిస్తుంది. అందుకే చాలా మంది ఈవీలను ప్రీమియం ఎక్స్ పీరియెన్స్ ఇచ్చే వాహనాలుగా చూస్తున్నారు.
మెయింటెనెన్స్ ఖర్చులు కూడా ఈవీల్లో తక్కువగా ఉంటాయి. ఇంజిన్ ఆయిల్ మార్చాల్సిన పని ఉండదు. క్లచ్, గేర్ బాక్స్, ఎగ్జాస్ట్ సిస్టమ్ లాంటి సమస్యలు తక్కువగా ఉంటాయి. సో, సర్వీస్ ఖర్చులు కూడా తగ్గుతాయి. బ్యాటరీ ఖర్చు కొంత ఎక్కువగా ఉన్నా, ప్రస్తుతం కంపెనీలు ఎక్కువ కాలం వారంటీలు ఇస్తున్నాయి.
గతంలో ఈవీలే కొనాలంటే ఛార్జింగ్ స్టేషన్ సమస్య ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారుతోంది. హైవేలు, షాపింగ్ మాల్స్, ఆఫీస్ ఏరియాలు, అపార్ట్ మెంట్లలో కూడా ఛార్జింగ్ పాయింట్లు పెరుగుతున్నాయి. ఇంట్లోనే రాత్రి సమయంలో ఛార్జ్ చేసుకునే అవకాశం కూడా ఉంది.
ప్రభుత్వం కూడా ఈవీలను ప్రోత్సహిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో రోడ్ టాక్స్ మినహాయింపులు, సబ్సిడీలు, తక్కువ రిజిస్ట్రేషన్ ఫీజులు అందిస్తున్నారు. అంతేకాదు, ఈవీల్లో పెద్ద టచ్ స్క్రీన్లు, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, స్మార్ట్ డ్రైవింగ్ మోడ్ లు, రీజెనరేటివ్ బ్రేకింగ్ లాంటి అత్యాధునిక ఫీచర్లు కూడా ఉంటాయి. తక్కువ ఖర్చు, అత్యాధునిక ఫీచర్లు, పర్యావరణహితమైన ప్రయాణం కారణంగా భారతీయ రోడ్లపై ఈవీ కార్లు వేగంగా ప్రజాదరణ పొందుతున్నాయి.
Read Also: కొనుగోలుదారులకు మారుతి సుజుకి షాక్.. అన్ని మోడళ్ల ధరల పెంపు!