Amaravati: ఏపీ రాజధాని అమరావతిని శాశ్వత రాజధానిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతున్నాయి.రాష్ట్ర విభజ తర్వాత తెలుగుదేరాజధాని అమరావతికి అంకురార్పణ జరిగిన విషయం తెలిసిందే. అప్పట్లోనే భూసమీకరణ కూడా జరిగిం ది. అయితే.. వైసీపీ హయాంలో మూడు రాజధానుల ప్రతిపాదన ముందుకు రావడం.. అమరావతిపై రాజకీయ ముద్ర వేయడం రైతులను హింసించడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపధ్యంలో ఫ్యూచర్లో రాష్ట్రంలో అధికారం మారినా అమరావతికి ఢోకా లేకుండా చేయడానికి, కూటమి ప్రభుత్వం కేంద్ర సహకారంతో రాజధానికి అధికార గుర్తింపు కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయంట.
అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని… 2014 లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం అన్ని పార్టీల అంగీకారంతో గుంటూరు – విజయవాడ ప్రాంతంలో రాజధాని నిర్మించటానికి, దీనికి అమరావతి అని పేరుపెట్టటానికి నిర్ణయించింది. 2017 మార్చి 2న ఆ ప్రతిపాదనను అసెంబ్లీలో వైసీపీ కూడా ఆమోందించింది. రాజధాని ప్రాంతపు అభివృద్ధి కోసం ఏపీ సీఆర్డీఏ ఏర్పాటైంది. దానిక సహాయంగా అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ను కూడా ఏర్పాటు చేశారు.
2019 మే నాటికి తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక హైకోర్టు భవనాల నిర్మాణం పూర్తయ్యాయి. మిగిలిన పనులన్నీ నిర్మాణ దశలో ఉన్నాయి. ఒకటి రెండేళ్లలో రాజధాని నగరానికి ఓ రూపం వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న తరుణంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది జగన్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాజధాని వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల నినాదం ఎత్తుకోవడంతో అమరావతిలో అభివృద్ది పనులు నిలిచిపోయాయి. ఆ క్రమంలో గత 2019-24 మధ్య అమరావతి వ్యవహారాన్ని పూర్తిగా అటకెక్కించారు. తర్వాత అమరావతి రైతుల సుదీర్ఘ పోరాటం, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతతో కూటమి సర్కారు ఏర్పడింది.
కూటమి రెండో సారి పగ్గాలు చేపట్టాక రెండో దశ భూ సమీకరణ పనులు మొదలయ్యాయి.. అమరావతిని మహా నగరంగా తీర్చిదిద్దేందుకు.. ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే.. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే.. మళ్లీ మూడు రాజధానుల పాట పాడుతుందన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. దానికి తగ్గట్లే జగన్ ఇటీవల అమరావతిపై అక్కసు వెల్లగక్కారు. సీఎం ఎక్కడ కూర్చుంటే అదే రాజధానని కొత్త బాష్యం చెప్పారు. అమరావతిని రివర్ బేసిన్లో కడుతున్నారని, దీనిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు.
ఆక్రమంలోనే రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా అమరావతిని కదల్చకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దానికి కేంద్రం కూడా సమ్మతించింది. ఇదేసమయంలో పార్లమెంటులో చట్టం చేయాలని నిర్ణయించింది. తాజాగా వచ్చిన సమాచారం మేరకు.. కేవలం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఒక్కటి ఆమోదిస్తే… దీనికి సంబంధించిన బిల్లు రూపొందించే ప్రక్రియ పూర్తికానుంది. ఇప్పటికే కేంద్ర న్యాయశాఖ, హోం శాఖ, ఆర్థిక శాఖలు ఆమోదించాయి. కీలకమైన నీతి ఆయోగ్ కూడా అమరావతికి ఓకే చెప్పింది. గత రెండు మాసాల కిందట నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అమరావతిలో పర్యటించారు. ఆయన సమూలంగా అన్ని అంశాలను పరిశీలించి ఓకే చేశారు.
ఇక, ఇప్పుడు పట్టణాభివృద్ధి శాఖ కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. ఈ నెల చివరిలో ప్రారంభమయ్యే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశ పెట్టి ఆమోదించనున్నారు. దీంతో అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత ఏర్పడనుంది. ఫలితంగా ప్రభుత్వం ఏది ఏర్పడినా.. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతే కొనసాగుతుంది. అతి త్వరలోనే అమరావతికి కేంద్రం చట్టబద్దత లబిస్తుందని కూటమి నేతలు ధీమాగా కనిపిస్తున్నారు.
Story By: Apparao, Big TV