AP Assembly Meeting: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకాబోతున్నాయి.. ఈ నెల 11 నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానుండటంతో జగన్తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరోసారి బహిరంగ విజ్ఞప్తి చేశారు. రోడ్లపై మాట్లాడటం కంటే అసెంబ్లీకి వచ్చి సమస్యలను చర్చించాలని సూచించారు. ఇప్పటికే సభకు రాని ఎమ్మెల్యేలకు ప్రజల సొమ్ముతో జీతభత్యాలు ఎందుకని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపధ్యంలో బడ్జెట్ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు, జగన్ హాజరవుతారా…లేదా? అన్న సస్పెన్స్కు ఆ పార్టీ తెరదించే ప్రయత్నం చేసింది. తొలిరోజు గవర్నర్ ప్రసంగానికి హాజరవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. అయితే కీలకమైన బడ్జెట్ సమావేశాలకు వారి హాజరుపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ప్రతిపక్షహోదా ఇచ్చే వరకూ అసెంబ్లీకి వచ్చేది లేదని మంకుపట్టు పుడుతున్న వైసీపీ అధ్యక్షుడు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఈ నెల 11 నుంచి ప్రారంభంకానున్న బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యే విషయమై సస్పెన్స్ వీడింది. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కావాలని వైసీపీ నిర్ణయించింది. తొలిరోజు గవర్నర్ ప్రసంగానికి హాజరయ్యాక అదే రోజు మధ్యాహ్నం జగన్ అధ్యక్షతన వైసీపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. పూర్తిస్థాయిలో సమావేశాలకు హాజరవ్వాలా? లేదా? అని ఆ సమావేశంలో నిర్ణయిస్తారంట.
తొలిరోజు సభ ప్రారంభం అవ్వగానే ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది… గత ఏడాది అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని వైసీపీ అడ్డుకుంది…ఈసారి కూడా సభకు వచ్చి…గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటుందా…లేదా సభకు వచ్చి గవర్నర్ ప్రసంగంలో పాల్గొంటారా అన్నది ఉత్కంఠగా మారింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరై చర్చల్లో పాల్గొనడం మానేశారు. తన పార్టీ 11 సీట్లకే పరిమితమవ్వడంతో ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదని అసెంబ్లీ ముఖమే చూడటం లేదు. ఆరు నెలలు శాసనసభకు గైర్హాజరైతే అనర్హత వేటు పడుతుందున్న భయమో? ఏమో? సభకు వచ్చినా నిముషాలు కూడా గడపకుండానే వెళ్లిపోతున్నారు. తన పార్టీ ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీకి హాజరు అవ్వనీయడం లేదు.
సభకు హాజరు కాకపోయినా సభలో చర్చించిన అంశాలు, ఆమోదించిన బిల్లులపై తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఎప్పటికప్పుడు ప్రెస్మీట్లు పెట్టి మాట్లాడుతూనే ఉన్నారు. శాసనసభకు రాకపోయినా ఆ విధంగా తన అభిప్రాయాలు ప్రజలకు తెలియజేస్తే సరిపోతుందని జగన్ స్వయంగా ప్రకటించారు కూడా. ఆ క్రమంలో అసెంబ్లీ సెషన్స్కు రాకపోతే అనర్హత వేటు వేస్తామని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గతంలోనే ప్రకటించారు.
మరోవైపు బడ్జెట్ సెషన్స్కు వైసీపీ హాజరుపై అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తాజాగా స్పందించారు. ఈ నెల 11 నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, జగన్తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలకు ఆయన మరోసారి బహిరంగ విజ్ఞప్తి చేశారు. రోడ్లపై మాట్లాడటం కంటే అసెంబ్లీకి వచ్చి సమస్యలపై చర్చించాలని సూచించారు. ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన అత్యున్నత వేదిక శాసనసభేనని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్షం సభకు హాజరైతే, వారు లేవనెత్తే ప్రతి అంశంపై సంబంధిత మంత్రులతో సమాధానం ఇప్పించడం తన బాధ్యత అని స్పీకర్ హోదాలో భరోసా ఇచ్చారు.
రోడ్లపై ఆందోళనలు, గుద్దులాటల తరహా రాజకీయ సంస్కృతి తనకు అర్థం కావడం లేదని అయ్యన్నపాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలపై పోరాటం చేయాలంటే చట్టసభల్లోనే చేయాలన్నారు. ప్రతిపక్ష సభ్యులంతా సభకు వచ్చి నిర్మాణాత్మక చర్చల్లో పాల్గొనాలని ఆయన కోరారు.
ఇదే సందర్భంలో నో వర్క్ నో పే విధానంపై కూడా అయ్యన్నపాత్రుడు మరోసారి గట్టిగా మాట్లాడారు. సభకు హాజరు కాకుండా ప్రజాధనం ద్వారా జీతాలు తీసుకోవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో రాజ్యాంగ పరిధిలో ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కొందరు సభ్యులు అసెంబ్లీ రిజిస్టర్లో సంతకం చేసి సభకు రాకపోవడంపైనా ఆయన ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ఈ సారి కూడా వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరైతే నో వర్క్ నో పే ప్రతిపాదన అమలవుతుందా అనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.
నిబంధనలు ప్రకారం సభకు హాజరుకాకపోతే…సభ్యత్వం రద్దు అవుతుందని కూటమి నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. అయినా వైసీపీ ఎమ్మెల్యేలు …అసెంబ్లీకి వచ్చినట్లు సంతకాలు పెట్టి…జీతాలు తీసుకుంటున్నారన్న విమర్శలున్నాయి… ఇప్పటికే ఈ విషయంపై అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ విచారణ చేస్తుంది. ఈ నేపధ్యంలో వైసీపీ ఈ సారి బడ్జెట్ సమావేశాల తొలిరోజున సభకు హాజరవ్వాలని నిర్ణయించడం గమనార్హం.
అదలా ఉంటే తెలంగాణలో ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్….శీతాకాల సమావేశాలకు తొలిరోజు హాజరై…కొద్ది సేపు అసెంబ్లీలో ఉండి…రిజిస్ట్రార్ లో సంతకం చేసి వెళ్లిపోయారు.కేసీఆర్ చేసినట్లుగానే….జగన్ కూడా గవర్నర్ స్పీచ్కు హాజరై….తర్వాత సభకు రాకుండా ఉంటారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో నడుస్తోంది.
Story by: Apparao, Big Tv